సంక్షోభం... పాక్లో దారుణంగా దిగజారిన పరిస్థితులు... అటు సైన్యం,ఇటు పోలీసులు.. మధ్యలో ఇమ్రాన్..
పాకిస్తాన్లో ప్రభుత్వాలు సైన్యం చేతిలో కీలుబొమ్మలా మారడం కొత్తేమీ కాదు. పేరుకే ప్రభుత్వ పాలన అయినా దాన్ని నియంత్రించే పగ్గాలన్నీ సైన్యం చేతిలోనే ఉంటాయి. కాదని మొండికేస్తే.. ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక దళాల చీఫ్ పాలకుడు కావడం అక్కడ అత్యంత సహజం. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులను పరిశీలిస్తే... మళ్లీ ఆ దేశం సైనిక నియంత్రణలోకే వెళ్తోందా అన్న అనుమానాలు కలగకమానవు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మలా మారినవేళ... అక్కడి సైన్యం ప్రదర్శిస్తున్న దూకుడు మళ్లీ సైనిక పాలన తప్పదా అన్న ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాక్లో పరిస్థితులు ఇంతలా దిగజారడం ఇదే మొదటిసారి.
Recommended Video
ఎందుకీ పరిస్థితులు...
పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవహారాల్లో సైన్యం నేరుగా జోక్యం చేసుకుంటోందంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది రోజుల క్రితం చేసిన ఆన్లైన్ ప్రసంగం తర్వాత అక్కడి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నవాజ్ సైన్యంపై చేసిన ఆరోపణలకు ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. ఓ పౌరుడు చేసిన ఫిర్యాదు మేరకే ఈ కేసు పెట్టినట్లు చెబుతున్నప్పటికీ... దీని వెనకాల సైన్యం ప్రోద్బలమే ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతకుముందు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత,దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇమ్రాన్ పెత్తనం మాటున సైన్యమే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తున్న విపక్షాలు ఉమ్మడి కార్యాచరణకు సిద్దమయ్యాయి.
పోలీస్ బాస్ కిడ్నాప్...
ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 16 నుంచి డిసెంబర్ 31 వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని విపక్షాలు నిర్వహించాయి. పాకిస్తాన్ ప్రజాస్వామ్య ఉద్యమం(పీడీఎం) పేరిట ఏర్పడిన ఈ కూటమికి నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ అవాన్ నాయకత్వం వహిస్తున్నారు. దీంతో సైన్యం ఆయన్ను కూడా టార్గెట్ చేసింది. సఫ్దర్ బయటే ఉంటే విపక్ష కూటమి మరింత రెచ్చిపోతుందని భావించిన సైన్యం ఆయన్ను అరెస్ట్ చేయాల్సిందిగా.. సింధ్ ప్రావిన్స్కు చెందిన పోలీస్ ఉన్నతాధికారి ముస్తక్ అహ్మద్ మహర్ను ఆదేశించింది. ఇందుకు సదరు పోలీస్ బాస్ అంగీకరించకపోవడంతో సైన్యం ఏకంగా ఆయన్నే కిడ్నాప్ చేసింది.
ప్రభుత్వానికి పోలీసుల ఝలక్...
సైన్యం ఆదేశాలను ధిక్కరించినందుకు పారామిలటరీ దళాలే నేరుగా రంగంలోకి దిగి ముస్తక్ అహ్మద్ మహర్ ఇంట్లో తనిఖీలు చేశాయి. అనంతరం ముస్తక్ను కిడ్నాప్ చేసి... విపక్ష కూటమి నేత సఫ్దర్ అవాన్ అరెస్టుకు ఆదేశాలిస్తున్నట్లుగా అతనితో బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకం పెట్టించారు. ఆ వెంటనే సఫ్దర్ను అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ సఫ్దర్ కోర్టు బెయిల్పై విడుదలయ్యారు. అయితే పోలీసులపై ఆర్మీ పెత్తనాన్ని నిరసిస్తూ సింధ్ పోలీస్ చీఫ్ ముస్తక్ నేత్రుత్వంలో అక్కడి పోలీసులు ప్రభుత్వానికి ఊహించని ఝలక్ ఇచ్చారు.
వెనక్కి తగ్గిన పోలీస్ బాస్...
ముస్తక్తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు 10 రోజుల పాటు లీవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసలే విపక్ష కూటమిని నియంత్రించలేక సతమతమవుతున్న ఇమ్రాన్ సర్కార్కు... ఒక్కసారిగా పోలీస్ ఉన్నతాధికారులంతా లీవు కోసం దరఖాస్తు చేసుకోవడం గట్టి షాకిచ్చినట్లయింది. అయితే తనపై ఆర్మీ దౌర్జన్యానికి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పోలీస్ బాస్ ముస్తక్ వెనక్కి తగ్గారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తన లీవును వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. మిగతా పోలీస్ ఉన్నతాధికారులు కూడా లీవులను వాయిదా వేసుకోవాలని కోరారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలిక ముగింపు లభించినా... మున్ముందు ఏమైనా జరగవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.