శ్రీలంక బాంబు పేలుళ్లపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ: మానవాళికి శాంతిని బోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతారని భావించే ఈస్టర్ సండే నాడు శ్రీలంకను అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై ప్రపంచం మొత్తం షాక్ కు గురైంది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఈ ఆత్మాహూతి దాడులను ముక్తకంఠంతో ఖండించాయి. హింసకు తావు లేదని స్పష్టం చేశాయి. క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ మారణకాండను సృష్టించడం పట్ల పోప్ ఫ్రాన్సిస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీలంకలోని క్రైస్తవులకు పోప్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
ఆత్మాహూతి దాడి టార్గెట్ లో భారత రాయబార కార్యాలయం: భద్రత కట్టుదిట్టం
ఈస్టర్ సండేను పురస్కరించుకుని ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోప్ ఫ్రాన్సిస్ హాజరయ్యారు. ఈస్టర్ సండే నాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్.. శాంతిబోధనలను చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదివారం కూడా ఆయన సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రపంచ మానవాళిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో శ్రీలంకలో చోటు చేసుకున్న మారణహోమాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని బోధించే ప్రబోధించే ప్రార్థనా స్థలాలపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదని అన్నారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పోప్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ఆయన క్రూరమైన హింసగా అభివర్ణించారు. శ్రీలంకలోని క్రైస్తవులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పోప్ చెప్పారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. క్రూరమైన హింస బారిన పడ్డ ప్రజలందరూ త్వరలోనే కోలుకుని, సాధారణ జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నానని చెప్పారు.