తొలిసారిగా ఇలా: సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఒంటరిగా ప్రార్థనలు నిర్వహించిన పోప్
వాటికన్ సిటీ: వాటికన్ సిటీ.. నిత్యం రద్దీగా కనిపిస్తుంది. ఇక ఆదివారం వచ్చిందంటే సెయింట్ పీటర్స్ బెసిలికా ప్రాంగణం ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతుంది. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం చర్చి సర్వీసులపై తీవ్రంగా పడింది. తొలిసారిగా ఎవరూ లేకుండా పోప్ తన ప్రసంగాన్ని వినిపించారు. ఇటలీలో కరోనావైరస్ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న నేపథ్యంలో దేశంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. దీంతో అక్కడి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఇక ఆదివారం కాంగ్రిగేషన్ కోసం పోప్ ఫ్రాన్సిస్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలకు తన ఆశీర్వాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఆత్మీయభావంతో మెలగాలని దేవునికి ప్రార్థన చేయాలని తన ప్రసంగం ద్వారా పిలుపునిచ్చారని వాటికన్ న్యూస్ పేర్కొంది. సాధారణంగా క్రిస్మస్ ఈస్టర్ ఆదివారం రోజున ప్రత్యేక దీవెనలు ఇచ్చే పోప్... ఈ సారి మాత్రం కరోనావైరస్తో ప్రపంచ తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ కష్టకాలంలో భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారిన పడి 26వేలకు పైగా మృతి చెందగా మరో 5 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.
Recommended Video
ఇప్పటికే ఇటలీలో చాలా స్థలాలు క్వారంటైన్లోకి వెళ్లిపోయాయి. ఇదిలా ఉంటే వాటికన్ మ్యూజియం కూడా వర్చువల్ టూర్స్ను ఉచితంగా అందిస్తోంది. ఇక పోప్ కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రతిరోజు బైబిల్ ప్రసంగం చేస్తూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు కరోనావైరస్తో ప్రపంచం వణికిపోతున్న నేపథ్యంలో వీటి బారిన పడిన వారికోసం కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తున్నారు.