ఆయుధ పరిశ్రమల్లో పెట్టుబడి: క్రైస్తవులు కారని పోప్
న్యూఢిల్లీ: ఆయుధ పరిశ్రమల్లో పెట్టుబడి, ఆయుధాలను తయారు చేసే వారు క్రైస్తవులు కారని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు. ఒకవేళ క్రైస్తవులమని వారు చెప్పుకుంటే అది తమను తాము మోసం చేసుకన్నట్టేనని ఆయన అన్నారు.
ఇటలీలోని టురిన్ పట్టణంలో జరిగిన యూత్ సభకు హాజరైన పోప్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఆయుధ పరిశ్రమలు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉందని విమర్శించారు.
ఆయుధాలను తయారు చేసే ప్రజలు, మేనేజర్లు, బిజినెస్ మ్యాన్లు క్రైస్తవులమని అనుకుంటున్నారని, వారి గురించి నన్ను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. ప్రపంచ యుద్ధాలను, వాటి కారణంగా కలిగే నష్టాలను కూడా వివరించారు.
మొదటి ప్రపంచ యుద్ధాన్ని 'ద గ్రేట్ ట్రాజెడీ ఆఫ్ ఆర్మనియా' అని పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో 'మారణహోమం' అన్న పదాన్ని ఉపయోగించకపోవడం విశేషం. దానికి ఒక కారణం ఉంది.
వందేళ్ల క్రితం 1.5 మిలియన్ల మంది ఆర్మేనియన్లను ఊచకోత కోశారని, 20వ శాతబ్దపు తొలి మారణహోమం అని గత ఏప్రిల్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టర్కీ ప్రభుత్వం వాటికన్ నుంచి తమ అంబాసిడర్ను వెనక్కి పిలిచిన సంగతి తెలిసిందే.