క్రైస్తవ గురువు పోప్ ఫ్రాన్సిస్కు కరోనా!.. ఇటలీలో వైరస్ విలయతాండవం.. 52కు పెరిగిన మృతులు
ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆథ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీని కరోనా భయం వెంటాడుతోంది. క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్(83) వైరస్ కాటుకు గురయ్యారన్న వార్త అందరినీ కలవరపెట్టింది. ఆదివారం నాటి ప్రార్థనల్లో పోప్ విపరీతంగా దగ్గుతూ కనిపించిన ఆయన.. మధ్యలోనే క్షమాపణలు కోరుతూ వెళ్లిపోయారు. ఇటలీలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.
దగ్గు, జలుబు కారణంగా వారం రోజుల పాటు వాటికన్ లో జరిగే కార్యక్రమాలకు హాజరుకాబోనన్న పోప్ ఫ్రాన్సిస్.. తాను ఎక్కడ ఉన్నప్పటికీ ప్రజల కోసమే ప్రార్థిస్తూ ఉంటానని తెలిపారు. 2013లో పోప్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్య కారణాల వల్ల పోప్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి. దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న ఆయనకు డాక్టర్ల బృందం చికిత్స అందించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా టెస్టులు కూడా నిర్వహించారు. గంటల ఉత్కంఠ తర్వాత టెస్టుల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ కు కరోనా లేదన్న వార్త వైరలైంది. అయితే..
వాటికన్ సిటీ ఉన్న రోమ్ తోపాటు ఇటలీ అంతటా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ కలకలం రేపుతున్నది. మమంగళవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం) నాటికి ఇటలీలో కరోనా సోకినవారి సంఖ్య 1,835కు పెరగగా.. చనిపోయిన వాళ్ల సంఖ్య 52కు చేరింది. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ఇటలీ ప్రభుత్వం ఎక్కడిక్కడ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేసి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఇప్పటిదాకా లక్ష మందికి వైరస్ సోకగా, 3,100 మంది ప్రాణాలు విడిచారు. ఇండియాలో కొత్త కేసులు వెలుగులోకి వస్తుండటంతో టెస్టుల కోసం ప్రజలు ల్యాబ్స్ వైపు పరుగులు తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.