118 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం హైజాక్, పేల్చేస్తామని బెదిరింపు!
లిబియాలో 118 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్ చేశారు. ఆఫ్రికియా ఎయిర్ లైన్స్కు చెందిన విమానం హైజాక్కు గురయింది. విమానాన్ని హైజాకర్లు మాల్టా వైపు మళ్లించారు.
లిబియా: లిబియాలో 118 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్ చేశారు. ఆఫ్రికియా ఎయిర్ లైన్స్కు చెందిన విమానం హైజాక్కు గురయింది. విమానాన్ని హైజాకర్లు మాల్టా వైపు మళ్లించారు. అక్కడ దించారు. విమానాన్ని పేల్చేస్తామని బెదిరించినట్లుగా తెలుస్తోంది.
ఎయిర్ బస్ ఏ320 హైజాక్ గురైందని, అనంతరం విమానం మాల్టాలో ల్యాండ్ అయిందని స్థానిక మీడియా వెల్లడించింది. హైజాక్ గురైన సమయంలో విమానంలో 111 మంది ప్రయాణికులు, ఏడుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు.
లిబియా ఇంటర్నల్ ఫ్లైట్ హైజాక్కి గురయిందని, దానిని మాల్టాకి మళ్లించినట్లు సమాచారం అందింది, భద్రతా అధికారులు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారని మాల్టా ప్రధఆని జోసఫ్ ముస్కట్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
లిబియా నియంత గడాఫీ మద్దతుదారులుగా చెప్పుకుంటున్న హైజాకర్లు గ్రేనేడ్లతో విమానాన్ని పేల్చివేస్తామని చెప్పారు. హైజాక్ నేపథ్యంలో మాల్టాలో పలు విమానాలు దారి మళ్లించి, మరి కొన్నింటిని రద్దు చేశారు.
లొంగిపోయిన హైజాకర్లు
విమానం హైజాక్కి గురైన ఘటనలో హైజాకర్లు లొంగిపోయినట్లు మాల్టా ప్రధాని జోసఫ్ ముస్కట్ ఆ తర్వాత ప్రకటించారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
హైజాకర్లు దానిని మాల్టాకు మళ్లించగా అధికారులు వారితో చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణీకులందరినీ విడిచిపెట్టారు.హైజాకర్లు తొలుత మహిళలను, చిన్నారులను వదిలేశారు. ఆ తర్వాత లొంగిపోయారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.