ఇండోనేషియాలో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదు
ఇండోనేషియా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం చాలామందిని రిలీఫ్ సెంటర్కు తరలించారు. సునామీ వచ్చే అవకాశాలులేవని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నార్త్ మలుకు రాజధాని టెర్నేట్కు 166 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఒక్కసారి కుదుపులకు గురికావడంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక భూకంపం సంభవించక ముందు చిన్నపాటి షాక్స్ రావడం జరిగిందని ఇండోనేషియాలోని భూకంపం మరియు సునామీ హెచ్చరిక కార్యాలయం అధికారి రహమత్ ట్రియోనో. ఇక సులవేసి ఉత్తర ప్రాంతంలో కూడా భూకంపం ప్రభావం కనిపించిందని రహమత్ ట్రియోనో తెలిపారు.అక్కడ కూడా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తమకు సమాచారం రాలేదని చెప్పారు. ఇక భూకంపం కేంద్రీకృతమైన పరిసరాల్లో భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
భూకంపం ధాటికి నష్టం వాటిల్లిన ప్రాంతాల ఫోటోలను అధికారులు విడుదల చేశారు. ఎంత నష్టం వాటిల్లిందనేదానిపై అధికారులు అంచనావేసే పనిలో పడిపోయారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో జనాభా ఒక మిలియన్ ఉంటుంది. మొత్తంగా ఇండోనేషియా జనభా 260 మిలియన్లు. ఈ దేశంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా బాగానే బద్ధలవుతూ ఉంటాయి. ఇక హిందూ మహాసముద్రంలో 2004లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం దాదాపు 12 దేశాలను కుదిపేసింది. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువ మంది ఇండోనేషియా ప్రజలే ఉన్నారు. గతవారం 6.9 తీవ్రతతో భూకంపం తూర్పు ఇండోనేషియాలో సంభవించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.