బిలావల్కు పరాభవం: ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లతో దాడి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీపై పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరీలు ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లు విసిరారు. ఇంతకీ ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందంటే లండన్ నగరంలోని ప్రఖ్యాత డౌనింగ్ స్ట్రీట్లోని ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద బిలావల్ భుట్టోకు ఈ పరాభవం ఎదురైంది.
కాశ్మీర్ సమస్యపై భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరీలు బ్రిటన్ రాజధాని లండన్లో మిలియన్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధానిగా అనుచరులు పిలుచుకునే సుల్తాన్ మహ్మూద్ ఛౌధ్రీ ఈ ప్రదర్శనను నిర్వహించారు.
ఇందులో పాల్గొని కాశ్మీర్ అంశంపై ప్రసంగించాలని బిలావల్ భుట్టో వేదిక వద్దరు చేరుకున్నారు. వేదికపైకి చేరుకుని బిలావల్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే భుట్టోపై పాకిస్థానీలే దాడికి దిగారు. ట్రవల్గార్ స్కేర్లోని వేదికపైకి భుట్టో చేరుకోగానే పాకిస్ధానీయులే ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లు విసిరారు.
బిలావల్ భుట్టో, ఆయన తండ్రి అసిఫ్ అలీ జర్దారీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వేదికవైపు దూసుకురావటంతో బ్రిటన్ పోలీసులు అతి కష్టంమీద బిలావల్ను వేదికపై నుంచి తరలించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు పాక్ ప్రధాని నవాజ్షరీఫ్కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు.
"కాశ్మీర్ గురించి, కాశ్మీర్ ప్రజల గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నీకు ఇక్కడేం పని?" అంటూ బాటిళ్లు విసిరిన వారు నినాదాలు చేశారు. దీంతో వేదికను ఎక్కిన మరుక్షణమే అక్కడి నుంచి బిలావల్ను అతి కష్టం మీద పోలీసుల సహాయంతో అక్కడి నుంచి తీసుకెళ్లారు.
భారత్కు వ్యతిరేకంగా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చే లక్ష్యంతో నిర్వహించిన ఈ మిలియన్ మార్చ్ పాకిస్ధాన్ అంతర్గత రాజకీయ సంక్షోభంగా మారింది.