మిరాకిల్ : తల్లికి బుల్లెట్లు దిగినా.. కడుపులో బిడ్డను బ్రతికించారు
చికాగో : మెడలో నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లి తల్లి చనిపోయినా.. కడుపులో బిడ్డ మాత్రం సురక్షితంగా బయటపడడం అబ్బురపరుస్తోంది. ఈ అరుదైన ఘటన దక్షిణా చికాగోలో చోటు చేసుకుంది. పాప జననానికి ఇంకా మూడో నెలల సమయం ఉన్నా.. అనుకోని ఘటనతో మూడు నెలల ముందుగానే తల్లి కడుపు నుంచి బయటకొచ్చింది చిన్నారి. ఇంత ప్రమాదకర ఘటనలోను ఆ పసికూన సురక్షితంగా బయటపడడంతో.. పాపకు మిరాకిల్ అని పేరు పెట్టారు.
ఇక ఘటన విషయానికొస్తే.. పరాశబియర్డ్ (19) అనే ఓ మహిళ 26 ఏళ్ల వ్యక్తితో కలిసి తన ఇంటిముందు కారులో కూర్చొని ఉంది. ఇంతలో.. గుర్తు తెలియని దుండగులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పరాశబియర్డ్ మెడలోకి రెండు బుల్లెట్లు చొచ్చుకుపోయి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
పక్కనే ఉన్న వ్యక్తి ఛాతీలోకి కూడా బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడి చేరకున్న పోలీసు అధికారులు.. పరాశబియర్డ్ కడుపుతో ఉండడం గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కడుపులో ఉన్న బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు వైద్యులు.
కాగా, బియర్డ్ తో కలిసి ఉన్న వ్యక్తి ఓ మాఫియా గ్యాంగ్ ముఠా సభ్యుడు కావడంతో దుండగులు అతన్ని ఎటాక్ చేశారని.. దీంతో అతని పక్కనే ఉన్న బియర్డ్ కూడా బలైపోయిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దుండగుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.