ఆధునిక అమరావతి: కడుపును చీల్చి..గర్భస్థ శిశువును చోరీ చేసి..! అన్నీ ట్విస్టులే!
చికాగో: పదేళ్ల కిందట వచ్చిన ఓ మెడికల్ థ్రిల్లర్ మూవీ అమరావతి. నెలలన్నీ నిండి, పురుడు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్న మహిళలను చంపి, గర్భస్థ శిశువును ఎత్తుకెళ్లడం ఈ మూవీ కథాంశం. అచ్చం అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. అగ్రదేశంగా పేరున్న అమెరికాలో చోటు చేసుకున్న అత్యంత అమానవీయ ఘటన ఇది. మరో వారం రోజుల్లో ప్రసవించాల్సిన ఓ మహిళపై దాడి చేశారు తల్లీకుమార్తె. కొసప్రాణంతో ఉన్న ఆమె కడుపును చీల్చి గర్భస్థ శిశువును ఎత్తుకెళ్లారు.
ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన చికాగోలో చోటు చేసుకున్న ఈ కేసులో 46 సంవత్సరాల క్లారిసా ఫ్యుగోరినా అనే మహిళను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. ఆమెతో పాటు క్లారిసా ప్రియుడు పీటర్ బబక్, కుమార్తె డెసైరీలను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురినీ దోషులుగా గుర్తించింది న్యాయస్థానం. వారికి కఠిన శిక్ష విధిస్తూ స్థానిక కాలమానం ప్రకారం గురువారం తీర్పు ఇచ్చింది.
మృతురాలి పేరు మర్లెన్ ఓచా లోపేజ్. 19 సంవత్సరాలు. నిండు గర్భిణి. భర్త యువాన్ని లోపేజ్, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. రెండోసారి ఆమె గర్భం దాల్చారు. ఘటన చోటు చేసుకోవడానికి మూడు వారాల కిందట ఆమె అదృశ్యం అయ్యారు. భర్త యువాన్ని లోపేజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఏప్రిల్ 23వ తేదీన కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తన ఇంటికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో పొదల్లో కనిపించారు.
అప్పుడే పుట్టిన బిడ్డలకు కావాల్సిన దుస్తులు, వీల్ ఛైర్ ఉచితంగా ఇస్తామంటూ ఫేస్బుక్లో వచ్చిన ఓ పోస్ట్ను చూసి, లోపేజ్ నిందితులకు ఫోన్ చేశారు. తాము చెప్పిన ప్రదేశానికి రావాల్సిందిగా వారు లోపేజ్ను ఆశ పెట్టారు. దీనితో- సంఘటన చోటు చేసుకోవడానికి మూడు వారాల కిందట ఆమె ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లారు. అంతే! అప్పటి నుంచి ఆమె కనిపించలేదు. 23వ తేదీన కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. ఆమె కడుపును చీల్చి గర్భస్థ శిశువును ఎత్తుకెళ్లినట్లు తేలింది.
ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చిన కేసు..
అప్పుడే పుట్టిన ఓ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో తనకు దొరికాడని, తాను ఆ బాబును సంరక్షిస్తున్నానని, దీనికి అవసరమైన ధన సహాయం చేయాల్సిందిగా ఓ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీన్ని గుర్తించిన లోపేజ్ కుటుంబీకులు ఆ బిడ్డ గురించి ఆరా తీయగా అసలు విషయం తేలింది. లోపేజ్ కుమారుడేనని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. బాబును స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా- లోపేజ్ కుమారుడేనని తేలింది.
ఆ తరువాత కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనితో అసలు నిందితుల బండారం బట్టబయలైంది. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుపై అన్ని కోణాల్లోనూ విచారించిన తరువాత-క్లారిసా ఫ్యుగోరినా, పీటర్ బబక్, డెసైరీలను దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం. వారికి కఠిన కారాగార శిక్ష విధించింది.