అగ్రరాజ్యాధినేతగా జో: యంగెస్ట్ ఆయనే.. ఓల్డెస్టూ ఆయనే: రిపేర్లు చాలా ఉన్నాయ్: ఫస్ట్ స్పీచ్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఆ తరువాత జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జో బిడెన్.. అత్యంత పిన్న వయస్కుడిగా సెనెటర్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత అత్యధికక వయస్సున్న అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 21 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది.
అగ్రరాజ్యాధినేతగా జో: ఎన్నో స్పెషాలిటీస్: యంగెస్ట్ ఆయనే.. ఓల్డెస్ట్ ఆయనే
అగ్రరాజ్యం.. అగ్రరాజ్యంగానే..
అమెరికాను అగ్రరాజ్యంగా మరింత బలోపేతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానకి పోడియం ముందుకు చేరుకోగా.. అహూతులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆయన గౌరవార్థం లేచి నిల్చుని, చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. అనంతరం బిడెన్ ప్రసంగించారు. అమెరికా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, ఆధునిక కాలంలోనూ అవి పునరావృతం అయ్యాయని అన్నారు. వాటిని అధిగమించడం, ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అనే పేరును నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు.
సవాళ్లు.. ప్రాధాన్యతలు
తన ముందు అనేక ప్రాధాన్యతలు, అదే స్థాయిలో సవాళ్లు ఉన్నాయని, ప్రతి అమెరికన్ తనకు అందించే మద్దతు తనకు ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యానికి సుదినంగా భావిస్తున్నానని చెప్పారు. అమెరికాలో ఈ రోజుల్లో ఐకమత్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా మారిందని బిడెన్ వ్యాఖ్యానించారు. అలాంటి ఐకమత్యాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని అన్నారు. నల్లజాతీయులు, శ్వేత జాతీయులనే భేదభావన, జాత్యహంకారాన్ని రూపుమాపడానికి తక్షణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.
జాత్యహంకారానికి చరమగీతం..
ట్రంప్ హయాంలో చోటుచేసుకున్న జాత్యహంకార దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఐకమత్యం గురించి నినాదాలు ఇవ్వడం కాదని, దాన్ని చేతల్లో చూపించాలని ఆక్ష్న సూచించారు. యూనిటీ లేకపోతే శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పలేమని తేల్చి చెప్పారు. దేశ పురోగమనానికి ఐకమత్యం ఇరుసుగా పనిచేస్తుందని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన సాగించిన ఈ నాలుగేళ్ల హయాంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని బిడెన్ అన్నారు.
ప్రతి ఒక్కరి బాధ్యతగా..
గతాన్ని విస్మరించడం, నేడు-రేపటి గురించి ఆలోచనలు చేయడం, దానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆధునిక అమెరికాలో ఎదురైన సవాళ్లను అధిగమించడానికి మనమందరం కలిసి పనిచేద్దామని అన్నారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ప్రతి అమెరికన్కూ హక్కు ఉందని చెప్పారు. తనకు ఓటు వేయని, తనకు మద్దతు పలకని వారికి కూడా తాను అధ్యక్షుడినేనని, వారి సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తానని అన్నారు. పార్లమెంట్ భవనంపై దాడి చేసిన వారి గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.