చైనా-భారత్ ఘర్షణ ట్రంప్కు తెలుసు, మధ్యవర్తిత్వానికి ప్రణాళిక లేదు, మృతులకు సంతాపం..
చైనా-భారత్ ఘర్షణ గురించి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్నకు తెలుసు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్నానీ పేర్కొన్నారు. సరిహద్దులో జరుగుతోన్న అంశాల గురించి తెలుసు అని.. సోమవారం రాత్రి తూర్పు లడాఖ్ వద్దగల గాల్వాన్ లోయలో భారత్-చైనా భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావించారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత భారత సైనికులు మృత్యువాత పడటంతో ఉద్రిక్తత నెలకొంది.
భారత్-చైనా సరిహద్దులో జరుగుతోన్న ఘర్షణ గురించి ట్రంప్కు తెలుసని, పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నారని మెక్ నానీ పేర్కొన్నారు. చనిపోయిన జవాన్లకు సంతాపం తెలిపారు. ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోందా అని ప్రశ్నించగా.. దానికి సంబంధించి తమ వద్ద సరైన ప్రణాళిక ఏమీ లేదు అని సమాధానం ఇచ్చారు. సరిహద్దులో పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఈ నెల 2వ తేదీన ట్రంప్, ప్రధాని మోడీకి ఫోన్ చేశారని తెలిపారు. పరిస్థితి గురించి వారు అప్పుడే చర్చించారని పేర్కొన్నారు.
Recommended Video
ఇరుదేశాల మధ్య పరిస్థితి దృష్ట్యా మధ్యవర్తిత్వం వహించేందుకు ఇదివరకే ట్రంప్ ముందుకొచ్చారు. గతనెలలో ప్రతిపాదన కూడా చేశారు. కానీ ఆ ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. సమస్యను ఇరుదేశాల దౌత్య మార్గాల చర్చించుకొని, పరిష్కరించుకుంటాయని తెలిపారు. చైనాతోనే కాదు పాకిస్తాన్తో కూడా మీడియేషన్ చేస్తానని గతేడాది అక్టోబర్లో ట్రంప్ ముందుకొచ్చారు. ఆ విషయాన్ని జనవరిలో కూడా మరోసారి ప్రస్తావించారు. కానీ భారత్ అందుకు అంగీకరించలేదు.