మాతో పెట్టుకుంటే తట్టుకోలేరని ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్..! చాలా మందిని చూసామన్న ఇరాన్..!!
వాషింగ్టన్/హైదరాబాద్: గల్ఫ్లో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయ మని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య సైనిక పరమైన ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ మాతో యుద్ధం చేయాలనుకుంటే అధికారికంగానే ఆ దేశాన్ని తుడిచిపెట్టాల్సి వస్తుంది. మరోసారి అమెరికాను బెదిరించే సాహసం కూడా చేయలేదు.. అని ట్రంప్ ఆదివారం ట్వీట్లో హెచ్చరించారు. ఇటు ఇరాన్ మిలిటరీ చర్యలపై ట్రంప్ అధికారులతో చర్చించారు.
ఆదివారం ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. నేను ఒకరిలా యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఆర్థికంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో మంది మరణించాల్సి వస్తుంది.. అని చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జవద్ జరీఫ్ స్పందిస్తూ...ట్రంప్ యుద్ధ హెచ్చరికలకు జంకేది లేదన్నారు. ఇరాన్ను ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరానియన్లు దురాక్రమణలను దాటుకొని వేలకొలది మైళ్లు విస్తరించారు. ఆర్థిక ఉగ్రవాదం, యుద్ధ బెదిరింపులతో ఇరాన్ను అంతం చేయలేరు.. ఇరానియన్లను గౌరవించే ప్రయత్నం చేయండి.. దాంతో ఏదైనా ఫలితముంటుంది.. అని ఘాటుగా సమాధానమిచ్చారు. మొత్తానికి అమెరికా, ఇరాన్ ల మద్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణానికి ఎప్పటికి బ్రేకులు పడతాయో చూడాలి.