కరోనాపై చైనా చారిత్రక విజయం సాధించిందన్న జిన్ పింగ్..ఆ నలుగురికి..!
బీజింగ్: కరోనావైరస్ను చైనా ధీటుగా ఎదుర్కొని మహమ్మారిపై విజయం సాధించిందని అన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. కరోనావైరస్పై ముందువరసలో ఉండి పోరాటం చేసిన మెడికల్ సిబ్బందికి అవార్డులు అందజేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో కోవిడ్-19 తొలికేసు వచ్చినప్పటి నుంచి కరోనాపై పోరాడిన తీరును ప్రశంసిస్తూ చైనా ప్రభుత్వ మీడియా వరుస కథనాలను ప్రసారం చేసింది. అంతేకాదు సవాలుగా నిలిచిన ప్రజారోగ్యం సంక్షోభంను కమ్యూనిస్ట్ నాయకత్వం సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టిందని పేర్కొంది.
ఇక అవార్డుల సందర్భంగా నలుగురికి బంగారు పతకాన్ని అందజేశారు అధ్యక్షుడు జిన్పింగ్. కొన్ని వందల మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతా ముఖాలకు మాస్కులు ధరించి కనిపించారు. కరోనావైరస్ పై ఒక చారిత్రాత్మక పోరాటం చేసి విజయం సాధించామని జింగ్ పింగ్ చెప్పినప్పుడు ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగి పోయింది. అంతేకాదు కరోనావైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అయితే చైనా మాత్రం అన్ని దేశాలకంటే ముందుగా పుంజుకుని గాడిలో పడిందని జిన్పింగ్ చెప్పారు. ఇదిలా ఉంటే కరోనావైరస్ తొలికేసు చైనాలో బయటపడగానే ప్రపంచానికి డ్రాగన్ కంట్రీ చెప్పకుండా దాచి సరిదిద్దుకోలేని తప్పు చేసిందని అమెరికా ఆస్ట్రేలియా దేశాలు మండిపడ్డాయి.
కరోనావైరస్ సోకి మరణించిన వారికి ముందుగా కొన్ని నిమిషాల పాటు అధ్యక్షుడు జిన్పింగ్తో పాటు అక్కడికి చేరివచ్చినవారు సంతాపం తెలిపారు. అనంతరం అవార్డుల కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా 83 ఏళ్ల జాంగ్ నాన్షాన్ కు గోల్డ్ మెడల్ బహూకరించారు జిన్పింగ్. వైరస్ యొక్క మూలాలను కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై పోరాడుతున్న వైద్య నిపుణులు, వైద్య సిబ్బందితో కలిసి పనిచేస్తామని ఈ సందర్భగా జాంగ్ చెప్పారు. గతేడాది వూహాన్ నగరంలో తొలి కేసు వెలుగు చూసినప్పటికీ దాని మూలాలను మాత్రం కనుగొనలేక పోయారు.
Recommended Video
మరో ముగ్గురికి "పీపుల్స్ హీరో " బిరుదుతో సత్కరించారు జిన్పింగ్. ఇందులో బైయో కెమికల్ నిపుణులైన 72 ఏళ్ల చెన్ వే ఒకరు. అయితే చైనా కరోనావైరస్ను ఎలా ఎదుర్కొందో తమ అనుభవాలను చెబుతున్న సమయంలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల కంటతడి పెట్టారు. ఇదిలా ఉంటే కరోనావైరస్ కాటేసేందుకు వస్తోందని ముందుగా ప్రపంచానికి చెప్పిన డాక్టర్ లీ వెన్లియాంగ్ ప్రస్తావన ఇక్కడ కనిపించలేదు. ఇక చైనాలో కరోనావైరస్ బారిన పడి 4,634 మంది మృతి చెందారు. కరోనావైరస్ను నియంత్రించేందుకు చైనా కఠిన నిబంధనలు అమలు చేసి సక్సెస్ అయ్యిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.