రికార్డు బద్దలు : హిల్లరీ ట్రంప్ డిబేట్ కు పోటెత్తిన వీక్షకులు
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలపై ప్రజల్లో ఎంతటి ఉత్కంఠ నెలకొందో తెలియజెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మధ్య మంగళవారం నాడు జరిగిన బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని టీవీల ద్వారా ఏకంగా 8.4కోట్ల మంది వీక్షించడం విశేషం. ఇది కూడా కేవలం 13 ప్రముఖ చానెల్స్ ను పరిగణలోకి తీసుకుని తేల్చిన లెక్క మాత్రమే.
ఇంటర్నెట్ ద్వారా వీక్షించిన వారి సంఖ్యను కూడా కలుపుకుంటే.. మొత్తం వీక్షకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇకపోతే ఇంతటి ప్రజాధరణ చూరగొన్న ఈ బిగ్ డిబేట్ 1980 నాటి జిమ్మి కార్టన్-రొనాల్డ్ రీగన్ డిబేట్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. వారిద్దరి మధ్య జరిగిన డిబేట్ ను 8కోట్ల మంది వీక్షించగా.. తాజాగా హిల్లరీ ట్రంప్ డిబేట్ ను 8.4కోట్ల మంది వీక్షించడం గమనార్హం.
హిల్లరీ-ట్రంప్ మధ్య తొలి డిబేట్ ఎంతటి ఆసక్తి రేకెత్తించిందంటే.. 98నిమిషాల పాటు వీరిద్దరి మధ్య జరిగిన డిబేట్ ను వీక్షకులంతా కదలకుండా చూసినట్టు నిల్సన్ సంస్థ వెల్లడించింది. దీనిపై స్పందించిన ట్రంప్.. ఇంతటి భారీ స్పందనను తాను ముందుగానే ఊహించానని చెప్పారు. డిబేట్ సందర్భంగా భారీగా ఊపిరి తీసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు మాట్లాడానని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
హిల్లరీ-ట్రంప్ మధ్య మరో రెండో డిబేట్స్ అక్టోబర్ 9,19 తేదీల్లో జరగనున్నాయి. వీటి తర్వాత నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.