మరోసారి ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్... చర్చి పూజారిపై అగంతకుడి కాల్పులు...
ఫ్రాన్స్లో వరుస ఉగ్ర దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల నీస్ నగరంలోని ఓ చర్చిలో ఉగ్రదాడిని మరవకముందే శనివారం(అక్టోబర్ 31) లియోన్ నగరంలో మరో దాడి జరిగింది. స్థానిక చర్చి పూజారిపై గుర్తు తెలియని అగంతకుడు కాల్చులు జరిపాడు. కాల్పుల్లో ఆ పూజారి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని గ్రీకు దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే అతని వివరాలేవీ వెల్లడించలేదు.
ఆ పూజారి సాయంత్రం 4గంటల సమయంలో చర్చిని మూసివేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం అగంతకుడు అక్కడి నుంచి పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ పూజారి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఫ్రెంచ్ పోలీసులు అగంతకుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఇటీవల ఫ్రాన్స్ నగరం నీస్లో జరిగిన ఉగ్ర దాడిలో మహిళ సహా ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడు. ఈ దాడిలో మరో ఇద్దరు కూడా చనిపోయారు. ఇది ఉగ్రవాదుల పనే అని నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి ఆరోపించారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో అతను ఓ మతానికి సంబంధించిన నినాదాలు చేశాడని తెలిపారు. ఈ ఘటన కంటే ముందు ఫ్రెంచ్ మిడిల్ స్కూల్ టీచర్ను తల నరికి చంపిన ఘటన ఫ్రాన్స్లో తీవ్రం సంచలనం రేకెత్తించింది. తాజా దాడితో ఫ్రాన్స్ మరోసారి ఉలిక్కిపడింది.లియోన్ నగరంలో జరిగిన దాడికి ఉగ్రవాద లింకులు ఉన్నాయా లేదా అన్నది తేలాల్సి ఉంది.