ప్రధానికి కరోనా వ్యాక్సిన్: తొలిసారిగా: అక్కడా ఫైజర్: యుద్ధ ప్రాతిపదికన దేశ ప్రజలందరికీ
టెల్ అవివ్: కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న ప్రపంచ దేశాలు ఒక్కొటొక్కటికిగా బయటపడుతున్నాయి. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకోవడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. తొలుత బ్రిటన్, ఆ తరువాత అమెరికా కరోనా వ్యాక్సిన్ను తమ దేశ ప్రజలకు అందిస్తున్నాయి. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టాయి. తాజాగా ఆ దేశాల జాబితాలో ఇజ్రాయెల్ కూడా చేరింది. ఇజ్రాయెల్.. కరోనా వ్యాక్సిన్ను సాధారణ ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
తొలి వ్యాక్సిన్ ప్రధానికి..
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా.. తొలి ఇంజెక్షన్ను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఇచ్చారు. రాజధాని టెల్ అవివ్ సమీపంలోని రమత్ గాన్లోని షెబా మెడికల్ సెంటర్లో ఆయనకు కరోనా వ్యాక్సిన్ను ఇంజెక్ట్ చేశారు. రెండో వ్యాక్సిన్ ఇంజెక్షన్ను ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి యులి ఎడెల్స్టెయిన్కు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది అక్కడి అధికారిక మీడియా. వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఏవైనా అపోహలు ఉంటే వాటిని తొలగించడానికే దీన్ని లైవ్ టెలికాస్ట్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
అక్కడా ఫైజర్ వ్యాక్సిన్..
కరోనా వైరస్ను నిర్మూలించడానికి ప్రపంచంలో మొట్టమొదటి సారిగా వ్యాక్సిన్ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనతను సాధించింది ఫైజర్. బ్రిటన్, అమెరికా, కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఫైజర్ వ్యాక్సిన్కు సాధారణ వినియోగానికి అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఫైజర్ వ్యాక్సిన్ పైనే ఆధారపడింది. ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వినియోగానికి ఇదివరకే అనుమతులు ఇచ్చింది. ఇక- దాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మోడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్కు కూడా త్వరలోనే అనుమతలు లభించనున్నాయి.
తొలిదశలో హెల్త్కేర్ వర్కర్లకు..
కరోనా వ్యాక్సిన్ను తొలిదశలో ఆరోగ్య కార్యకర్తలకు అందజేయనున్నారు. వైద్యరంగంలో పనిచేస్తోన్న హెల్త్ వర్కర్లకు ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దీనికోసం ఇజ్రాయెల్ వ్యాప్తంగా 10 ఆసుపత్రులతో పాటు పలు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచే హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తామని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వృద్ధులకు రెండోదశలో వ్యాక్సిన్ ఇస్తామని, ఇలా దశలవారీగా చిట్టచివరి వ్యక్తికీ చేరేలా సన్నాహాలు చేశామని తెలిపారు.
రోజూ 60 వేల ఇంజెక్షన్లు..
రోజూ 60 వేల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి మాస్ వ్యాక్సినేషన్ చేపట్టాలనేది అక్కడి ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం పెద్ద ఎత్తున ఫైజర్ వ్యాక్సిన్ను తెప్పించుకోబోతోంది. ఎనిమిది మిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం నెతన్యాహు ప్రభుత్వం.. ఫైజర్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇజ్రాయెల్ జనాభా తొమ్మిది మిలియన్లు. ఒక్కో పౌరుడికి రెండుసార్లు టీకాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తొలిదశ ఎనిమిది మిలియన్ డోసులకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.
మోడెర్నాతోనూ అగ్రిమెంట్..
కరోనాను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ను రూపొందించిన మరో ఫార్మా కంపెనీ మోడెర్నాతోనూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు మిలియన్ డోసుల కోసం ఆర్డర్ ఇచ్చింది. మోడెర్నా వ్యాక్సిన్కు మరో నాలుగైదు రోజుల్లో అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. మోడెర్నా.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వ్యాక్సిన్ను సరఫరా చేస్తుంది. మోడెర్నా వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా కూడా పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.
పాలస్తీనియన్లకు ఎప్పుడు?
ఇజ్రాయెల్ను ఆనుకుని ఉన్న పాలస్తీనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ను సరఫరా చేయకపోవచ్చని తెలుస్తోంది. ఇజ్రాయెల్లో వ్యాక్సినేషన్ పూర్తయినప్పుడే పాలస్తీనియన్లకు అందిస్తారని సమాచారం. వెస్ట్బ్యాంక్లో అక్రమంగా నివసిస్తోన్న యూదులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఈ షెల్టర్లలో నివసిస్తోన్న వారికి ఇజ్రాయెల్ పౌరసత్వం ఉంది. సుమారు 25 లక్షల మంది వరకు జనాభా ఉన్న పాలస్తీనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ అందకపోవచ్చని అంటున్నారు. ఇజ్రాయెల్లో 3,72,886 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 3,074 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 24,223గా నమోదు అయ్యాయి. 3,45,589 మంది దీని బారి నుంచి కోలుకున్నారు.