బ్రిటన్లో మోడీ ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం
లండన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అక్కడి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) సిద్దమయ్యారు. నెల రోజుల పాటు బ్రిటన్ లోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో మోడీ ఎక్స్ ప్రెస్ పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టారు.
ఆదివారం ఈ యాత్ర ప్రారంభమైందని నరేంద్ర మోడీ స్వాగత కమిటి ప్రతినిధి మయూరి పార్కర్ తెలిపారు. బ్రిటన్లో లిటిల్ ఇండియాగా ప్రఖ్యాంతి గాంచిన వెంబ్లే లోని ఈ లింగ్ రోడ్డుకు ముందుగా ఈ బస్సు చేరుకుంటుంది. తరువాత బ్రిటన్ లో ప్రసిద్ధి చెందిన నగరాలలో సంచరిస్తుంది.
దీపావళి పండగ నాటికి టాఫల్ గర్ స్క్వేర్ కు ఈ బస్సు చేరుకుంటుందని వివరించారు. వచ్చే నెల ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారి బ్రిటన్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సు పే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ప్రవాస భారతీయులు చెప్పారు.
నవంబర్ 13వ తేదిన వెంబ్లే స్టేడియంలో మోడీకి ఒలంపిక్స్ తరహాలో స్వాగతం చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే వందలాది మంది ప్రవాస భారతీయులు వారి పేర్లు నమోదు చేసుకున్నారు.