తప్పు మీదే: అభివృద్ధి చెందిన దేశాలకు మోడీ షాక్
ప్యారిస్: వాతావరణ మార్పులకు కారణం మేము కాదని, అయినా ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు మా అభివృద్ధి పైన ప్రభావం చూపిస్తాయని, అభివృద్ధి చెందిన దేశాలు అవి సంపన్నం అవడం కోసం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణ మార్పులు సంభవించాయని ప్రధాని మోడీ అన్నారు.
వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలకు ప్రధాని మోడీ స్పష్టమైన సందేశాన్ని వినిపించారు. పర్యావరణ పరిరక్షణకు ఆ దేశాలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలన్నారు. ఏఖపక్ష చర్యలు తీసుకుంటే వాతావరణ మార్పులపై పోరులో ఆర్థిక అడ్డంకులు ఎదురవుతాయన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్నారు. అప్పుడే శుద్ధ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ప్రజల అవసరాలు తీర్చగలవన్నారు.
శిలాజ ఇంధనాల ఆధారంగా సంపన్నవంతమై బలపడిన అభివృద్ధి చెందిన దేశాలు.. కర్బన ఉద్గారాలను తగ్గించే భారాన్ని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి నెట్టితే అది నైతికంగా తప్పవుతుందన్నారు.
కర్బన ఉద్గారాలను తగ్గించడానికి చేస్తున్న సమష్టి కృషిలో అనుసరించాల్సింది ఉమ్మడి సూత్రమే అయినప్పటికీ బాధ్యతల్లో తేడాలు ఉండాల్సిందేనని ప్రధాని మోడీ అన్నారు. లేకుంటే అది నైతికంగా తప్పు అవుతుందని ఆయన సోమవారం నాటి ఫైనాన్షియల్ టైమ్స్ ఒపీనియన్ సెక్షన్లో రాశారు.
వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా సాగుతున్న పోరులో అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ భారాన్ని మోయడం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చాలని ప్రధాని మోడీ డిమాండ్ చేశారు. వాతావరణ మార్పుపై సిఓపి21 సదస్సు సోమవారం ఇక్కడ ప్రారంభమైన రోజే కాకతాళీయంగా బ్రిటన్లోని ప్రముఖ ఫైనాన్షియల్ దినపత్రికలో ఈ వ్యాసం ప్రచురితమయింది.