‘భీమ్’ యాప్ వినియోగదారులకు.. ప్రధాని బంపర్ ఆఫర్
‘భీమ్’వినియోగదారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ యాప్ను రిఫర్ చేసే ప్రతి యూజర్ అకౌంట్కు రూ.10 జమవుతుందన్నారు.
నాగపూర్: డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ 'భీమ్'వినియోగదారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఓ వినియోగదారుడు మరో వ్యక్తిని ఈ యాప్కు యాడ్ చేస్తే, అలా జోడింపబడిన వ్యక్తి మూడు లావాదేవీలు నిర్వహిస్తే.. జోడించిన వినియోగదారుడి అకౌంట్కు రూ.10 జమవుతాయని వెల్లడించారు.
ఈ ఆఫర్ అక్టోబర్ 14 వరకు కొనసాగుతుందని ప్రధాని ప్రకటించారు. బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా శుక్రవారం నాగపూర్లో ఆయన డిజిటల్ పేమెంట్స్ కోసం కొత్తగా భీమ్-ఆధార్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినవారిని పైకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేశారు. బీఆర్ అంబేద్కర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మేము వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తాం. డిజిధన్ పేదలను శక్తివంతులను చేస్తుంది. ఇది అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వచ్ఛమిషన్ అని మోడీ అన్నారు.
భీమ్ యాప్ను రిఫర్ చేసే ప్రతి యూజర్ అకౌంట్కు రూ.10 జమవుతుందని ఆయన చెప్పారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి మోడీ నివాళులర్పించారు. 1956, అక్టోబర్ 14న అంబేద్కర్తోపాటు ఆయన ఆరు లక్షల మంది అనుచరులు బుద్ధిజాన్ని స్వీకరించిన దీక్షాభూమిని కూడా ప్రధాని సందర్శించారు.
ప్రపంచ చరిత్రలో ఇంత మంది ఒకేసారి మతం మారిన ఘటన మరొకటి లేదు. దీక్షాభూమికి ప్రధానితోపాటు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్లారు. అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి కూడా మోడీ పూలమాల వేసి నివాళులర్పించారు.