క్రైస్ట్ చర్చ్ ఘటనకు ప్రతీకారంగా ఆత్మాహూతి దాడులు: శ్రీలంక రక్షణమంత్రి: తౌహీత్ జమాత్ పై నిషేధం?
కొలంబో: రెండు నెలల కిందట న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో రెండు మసీదులపై ఇద్దరు వ్యక్తులకు కాల్పులకు తెగబడిన ఘటనకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు చోటు చేసుకున్నాయని ఆ దేశ ప్రభుత్వం నిర్ధారించింది. పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన దర్యాప్తు సందర్భంగా ప్రాథమికంగా ఈ విషయం తేలిందని శ్రీలంక రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజెవర్ధనే స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ లో ఆయన ఓ ప్రకటన చేశారు. ఆత్మాహూతి దాడులు చోటు చేసుకున్న అనంతరం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆయన పార్లమెంట్ లో ప్రసంగించారు. ఆత్మాహూతి దాడుల నేపథ్యంలో.. తీసుకోవాల్సిన చర్యలపై శ్రీలంక పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది.
శ్రీలంకలో సిరియా దేశస్థుడి అరెస్ట్: పేలుళ్లకు సూత్రధారిగా అనుమానాలు?
కిందటి నెల 15వ తేదీన న్యూజీలాండ్ క్రైస్ట్ చర్చ్ లో రెండు మసీదులపై ఇద్దరు సాయుధులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇద్దరు సాయుధులు రెండు మసీదుల్లో తుపాకులతో చొరపడి, ప్రార్థనల్లో నిమగ్నమైన వారిపై విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించారు. అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే న్యూజీలాండ్ తుపాకీ సంసృతి కనిపించడం, పైగా మసీదులపై దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
ఆ ఘటనకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు జరిగినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్వయంగా ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేశారు. దాడుల అనంతరం తాము 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారిలో సిరియా జాతీయుడొకరు ఉన్నారని రువాన్ తెలిపారు. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, దాడులకు ప్రధాన సూత్రధారిని పట్టుకుని తీరుతామని ఆయన చెప్పారు.
నేషనల్ తౌహీత్ జమాత్ పై నిషేధానికి ప్రతిపాదన..
ర్యాడికల్ భావాలు గల వ్యక్తులతో ఏర్పాటైన నేషనల్ తౌహీత్ జమాత్ సంస్థపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని రువాన్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపాదించారు. గతంలోనూ తౌహీత్ జమాత్ సంస్థ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉండొచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తౌహీత్ జమాత్ కార్యకలాపాలను నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రతిపాదించారు. దీనిపై శ్రీలంక పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.