60 రోజులు..21 ప్రాణాలు.. 1.5కి.మీ వెనక్కి.. ఇరు సైన్యాల డీఎస్కలేషన్.. చైనా కీలక ప్రకటన..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు 60 రోజుల తర్వాత ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. తూర్పు లదాక్ లోని కీలక ప్రాంతాలను ఆక్రమించడే లక్ష్యంగా హింసాత్మక కవ్వింపులకు పాల్పడిన చైనా మన జవాన్లు 21 మందిని పొట్టనపెట్టుకుంది. చివరికి భారత్ వాదనకే తలొగ్గి అది వెనుదికగక తప్పలేదు.
మూడో దశ చర్చల్లో మలుపు.
సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు ఫలించడంతో ఉద్రిక్తత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎల్ఏసీ నుంచి రెండు దేశాల సైన్యాలూ 1.5 కిలోమీటర్లు వెనక్కి జరగాలనే అంగీకారానికి వచ్చాయి. దీనిపై చైనా కీలక ప్రకటన చేసింది. గాల్వాన్ లో హింసాత్మక ఘటన తర్వాత తారా స్థాయికి చేరిన ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. రెండు దేశాల సైన్యాధికారుల మధ్య జూన్30న జరిగిన మూడో దశ చర్చల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది.
కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా? : పాజిటివ్ రేటుపై కేంద్రం కీలక ప్రకటన : WHO వార్నింగ్ దాటి..
భారత్ సహకరిస్తుందని ఆశ..
‘‘జూన్ 30న కమాండర్ల స్థాయిలో జరిగిన మూడో దశ చర్చల్లో.. బలగాల ఉపసంహరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతకు ముందు జరిగిన రెండు దఫాల చర్చలకు కొనసాగింపుగానే నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లయింది. ఫ్రంట్ లైన్ నుంచి వెనుదిరిగే ప్రక్రియ వేగవంతమైంది. సరిహద్దు వివాదాలను సైనిక, దౌత్య మార్గాల్లో మాత్రమే పరిష్కరించుకునేందుకు భారత్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం''అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జువో లిజియాన్ ప్రకటించారు.
ఆ మూడు ప్రాంతాల్లో..
ఎల్ఏసీ వెంబడి తూర్పు లదాక్ లో గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో గడిచిన రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, తాజా అంగీకారం మేరకు, గాల్వాన్ లోయలోని 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ 14), హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని ఫింగర్ 4 ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనుదిరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించినట్లు, వాహనాలను వెనక్కి మళ్లించినట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లదాక్ లో పర్యటించిన తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో రెండు గంటలపాటు ఫోన్లో మాట్లాడారు. ఆ మరుసటిరోజైన సోమవారమే బఫర్ జోన్ నుంచి బలగాల ఉపసంహరణపై రెండు దేశాలూ ప్రకటన చేశాయి.