నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న మోడీని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తొలిసారి బెయిల్ను తిరస్కరించిన న్యాయస్థానం... బెయిల్ మంజూరు చేయాలంటూ రెండోసారి దరఖాస్తు చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నీరవ్ మోడీ.
ముంబైలో ఆ ఇంటి అద్దె కేవలం 64 రూపాయలే...కానీ అందులో ఎవరూ చేరడం లేదు ఎందుకని..?
భారత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఈడీ తరపున వాదిస్తున్న క్రౌన్ ప్రాసెక్యూషన్ సర్వీస్... న్యాయస్థానం ముందు ఓ ఫైలును ఉంచింది. ఈ కేసును ఛీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బత్నాట్ విచారణ చేస్తున్నారు. ఇదే జడ్జి లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా కేసును కూడా గత డిసెంబరులో విచారణ చేసి తీర్పు చెప్పారు. ప్రస్తుతం ఆ ఫైలును జడ్జి పరిశీలిస్తున్నారు. దీన్ని నీరవ్ మోడీ ముందే సమీక్షిస్తారని తెలుస్తోంది.
భారత అధికారులు చేపడుతున్న విచారణకు నీరవ్ మోడీ సహకరించడం లేదని ఈడీ తరపున వాదిస్తున్న లాయర్ టోబీ క్యాడ్మ్యాన్ జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. నీరవ్ మోడీ పాల్పడింది సాధారణమైన మోసం కాదని ఇదో హైప్రొఫైల్ కేసుగా పరిగణించాలని చెప్పారు. అంతేకాదు అతనికి బెయిల్ మంజూరు చేస్తే దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. కేసులో వాదనలు ప్రత్యక్షంగా వినేందుకు ఈడీ, సీబీఐ అధికారులు లండన్కు వెళ్లారు.
ఇదిలా ఉంటే నీరవ్ మోడీ తొలిసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం హెఎంపీ వాండ్స్వర్త్ జైలులో జుడీషియల్ కస్టడీలో మోడీ ఉన్నాడు. గత వారం నుంచి మోడీ కస్టడీలో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసినందుకు, రెండు పాస్పోర్టులు కలిగి ఉన్నారన్న కేసులను లండన్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. గతేడాది లండన్కు పారిపోయిన నీరవ్ మోడీ... అతని భారత పాస్పోర్టును రద్దు చేసినప్పటికీ కూడా... బ్రిటన్ నుంచి నాలుగు సార్లు ఇతర దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాడు.