ట్రంప్ నిరంకుశత్వంపై తిరుగుబాటు ప్రారంభం, 30 నగరాల్లో నిరసనలు
అమెరికా నూతన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆదివారం ఆ దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు 30 నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
వాషింగ్టన్: అమెరికా నూతన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి ముస్లింలు అమెరికాకు రాకుండా కొత్త అధ్యక్షుడు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆదివారం ఆ దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు 30 నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
అధ్యక్షుడి నిరంకుశ డిక్రీని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వలస ప్రజల తరపున న్యాయవాదులు అమెరికా వ్యాప్తంగా పలు నగరాలలో ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.
వేలాది మంది వీధుల్లోకి...
వాషింగ్టన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్, ఫిలడెల్ఫియా తదితర నగరాలలో వేలాది మంది ప్రజలు అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకత తెలుపుతూ వీధుల్లోకి వచ్చారు. వాషింగ్టన్ నగరంలో వేలాది మంది నిరసనకారులు శ్వేతసౌధం ఎదుట గుమికూడి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విమానాశ్రయాలే లక్ష్యంగా...
వలస ప్రజల నిషేధ డిక్రీపై ఫెడరల్ జడ్జి అన్ డోన్లీ ఎమర్జెన్సీ స్టే విధించినప్పటికీ.. విమానాశ్రయాల నుంచి అమెరికాలోకి వలస ప్రజలను అనుమతించక పోవడం వల్ల అమెరికన్లలో చాలామందిని ఆగ్రహంలో ముంచెత్తుతోంది.
దీంతో నిరసనకారులు లాస్ ఏంజిల్స్, చికాగో, న్యూయార్క్ ప్రధాన విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంకా టౌన్ స్క్వేర్ లలో, బంగోర్, మైనే, బ్లూమింగ్టన్, ఇండ్, బోయిసి వంటి చిన్న విమానాశ్రయాలలోనూ ఆందోళనకారులు గుమికూడి నిరసన వ్యక్తం చేశారు.
పాటించే ప్రసక్తే లేదు: న్యూయార్క్ మేయర్
మన నగర విలువల పరిరక్షణ పేరిట జరిగిన ర్యాలీలో న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో స్వయంగా పాల్గొన్నారు. ట్రంప్ ఆదేశాలను గుడ్డిగా పాటించే ప్రసక్తే లేదని ఆయన వారం క్రితమే కుండబద్ధలు కొట్టారు. ఓ ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధ్యక్షుడి నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని చెప్పారు.
తీవ్రమైన నేరాలకు పాల్పడితేనే...
వలసదారులపై
ఫెడరల్
ప్రభుత్వమే
చర్యలు
తీసుకునేలా
నగరాలకు
ఉన్న
ప్రత్యేక
హోదా,
వాటి
న్యాయ
పరిధిని
తొలగించాలని
దేశాధ్యక్షుడు
భావిస్తున్నారని,
న్యూయార్క్
పోలీస్(ఎన్
వైపీడీ)కి
వచ్చే
నిధుల్లో
కోత
పెట్టాలని
అనుకుంటున్నారని,
అదే
జరిగితే
తాము
కోర్టుకు
వెళతామని
మేయర్
బిల్
డి
బ్లాసియో
పేర్కొన్నారు.
తమ ప్రాంత ప్రజలను కాపాడుకోవల్సిన బాధ్యత తమపై ఉందని, ఇలాంటి నిర్ణయాలు ఫెడరల్ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధమని, దీనిపై కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందనే గట్టి నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వలసదారులను తిప్పి పంపమని, తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని మాత్రం అమెరికాలో ఉంచమని మేయర్ బ్లాసియే హెచ్చరించారు.
ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రాల గుర్రు...
మరోవైపు ట్రంప్ తీసుకున్న, తీసుకోబోయే వివాదాస్పద, ఏకపక్ష నిర్ణయాలను అడుగడుగునా అడ్డుకునేందుకు రాష్ట్రాలు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లింలు అమెరికాకు రాకుండా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసిన నేపథ్యంలో.. భవిష్యత్తులో కూడా ట్రంప్ ఆడిందే ఆటగా కొనసాగే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది.
ఇది ఉగ్రవాదులను రెచ్చగొట్టే చర్య...
ట్రంప్ తీసుకొచ్చిన ఆదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని సెనేటర్ చార్లెస్ ష్కూమర్ వ్యాఖ్యానించగా... బోస్టన్ మేయర్ మార్టీ వాల్ష్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఒకడుగు ముందుకేసి.. ముస్లింలకు స్వాగతం పలుకుదాం, వారిని అమెరికాలోకి ప్రవేశించనిద్దామంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ ఆదేశం వలసల ప్రజలు, వారి కుటుంబ సభ్యుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టిందని, ఆ ఆదేశాన్ని రద్దు చేసే వరకు తాము వెనక్కి తగ్గమని వర్జీనియా స్టేట్ న్యాయవాదుల బృందం డైరెక్టర్ మిషెల్ లార్యు వ్యాఖ్యానించారు.