ట్రంప్ ప్రతిపాదనతో భగ్గుమన్న పాలస్తీనా... మరో బాల్ఫోర్ డిక్లరేషన్లా ఉందంటూ ఆగ్రహం
ఇజ్రాయిల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ ప్రకటించి అగ్గి రాజేశారు. పాలస్తీన కొత్త దేశంగా అవతరించాలని ఇదే వారికి చివరి అవకాశం అని ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో సమావేశం సందర్భంగా చెప్పారు. అంతేకాదు ఇజ్రాయిల్ పాలస్లీనా వివాదంకు చెక్ పెట్టేందుకు నెతన్యాహూ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక తూర్పు జెరుసలేంలో పాలస్తీన రాజధాని ఉండాలని అన్నారు. ఈ అడుగు రెండు దేశాలకు మంచిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మిడిల్ ఈస్ట్ ప్లాన్
అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో వైట్హౌజ్లో భేటీ అయ్యారు. ఇజ్రాయిల్ కోసం ప్రధాని నెతన్యాహూ చాలా చేశారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే పాలస్తీనీయులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండాలని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలోనే పాలస్తీన ప్రత్యేక దేశంగా ఆవిర్భవించాలని దీన్నొక చారిత్రాత్మక అవకాశంగా మలుచుకోవాలని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ ప్రకటనతో పాలస్తీనీయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ట్రంప్ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. అంతేకాదు ట్రంప్ ఇజ్రాయిల్ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ట్రంప్ మిడిల్ ఈస్ట్ ప్లాన్పై పోరాడతాం: పాలస్తీనా ప్రజలు
ట్రంప్ - నెతన్యాహూలు ప్రతిపాదించిన ప్లాన్ను పాలస్తీనీయులు తిరస్కరించారు. ఈ ప్లాన్ ఆమోదయోగ్యం కాదని చెబుతూ దీనిపై పోరాడతామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అసలు ట్రంప్కు ఏం అధికారముందని ఇలాంటి ప్రతిపాదనలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు పాలస్తీనాలోని సామాజిక కార్యకర్తలు. ట్రంప్ ప్రకటన 1917 నాటి బాల్ఫర్ డిక్లరేషన్ను తలపిస్తోందని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన ప్లాన్ కూడా మరో చిచ్చు పెట్టేలా ఉందని చెబుతున్నారు.
ఇజ్రాయిల్ దేశానికి మాత్రమే ప్రయోజనాలు
ఈ ప్రతిపాదన వల్ల ఇజ్రాయిల్ దేశానికి మాత్రమే ప్రయోజనాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ నిబంధనలను కూడా ఉల్లంఘించేలా ఉందని చెప్పారు. 1967లో ఎలాగైతే పాలస్తీన ఉన్నిందో అలాంటి సరిహద్దులతోనే ప్రత్యేక దేశం కావాలిన డిమాండ్ చేస్తున్నారు. దీనికోసమే ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, త్యాగాలు చేశారని పాలస్తీనీయులు చెబుతున్నారు. తమకు ఎలాంటి ఆర్థిక సహాయం అక్కర్లేదని తెగేసి చెబుతున్నారు.
పాలస్తీనా హక్కులను కాలరాసేందుకు ట్రంప్ ఎవరు..?
జూన్ 2019లో ప్రస్తుత ప్లాన్కు సంబంధించిన ఆర్థిక వ్యూహాలను బహ్రెయిన్ సదస్సులో బయటపెట్టడం జరిగింది. పాలస్తీనాకు 50 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని పొందుపర్చారు. అయితే ఈ ప్లాన్ను పాలస్తీనా ప్రజలు వ్యతిరేకమని పాలస్తీనా అథారిటీ మాజీ మంత్రి జియాద్ అబు జైద్ చెప్పారు. దేశ రాజధానిగా జెరుసలేంను వదులుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పారు.
అదే సమయంలో జోర్డాన్ వ్యాలీ పశ్చిమ తీర ప్రాంతాలను కూడా వదులుకోబోమని తెగేసి చెప్పారు. పాలస్తీన హక్కులను కాలరాసేందుకు ట్రంప్ నెతన్యాహులకు హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇజ్రాయిల్ ఆక్రమణ ఎక్కువై పాలస్తీనా హక్కులను హరించివేస్తుందని సమీ అబు షెహదా అనే పాలస్తీనా నాయకుడు చెబుతున్నారు.
పాలస్తీనాలో మిన్నంటిన నిరసనలు
ఇక ట్రంప్ మరియు నెతన్యాహూ ప్రకటన చేయగానే పాలస్తీన ప్రాంతం భగ్గుమంది. వందల సంఖ్యలో పాలస్తీనా ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. గాజా స్ట్రిప్ వెంబడి నిరసనలు వ్యక్తం చేశారు. ట్రంప్ ఫోటోలను కాల్చివేశారు. పాలస్తీనా అమ్మకానికి కాదు ఉండేది.. ట్రంప్ అంతం కోసమే ఉందంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఇద్దరూ అంటే ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఎన్నికలు ఎదుర్కోనున్నారు.