కాశ్మీర్ అల్లర్లపై హఫీజ్ సయీద్ సంచలనం, పాక్కు చిక్కులు
లాహోర్: జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన ప్రకటన చేశారు. కాశ్మీర్లో బుర్హాన్ వాని మృతి అనంతరం జరిగిన ఆందోళనకు ఎఈటీ ప్రాతినిథ్యం వహించిందని చెప్పాడు.
హఫీజ్ సయీద్ మాట్లాడుతూ.. లక్షలాది మంది కశ్మీరీలు వీధుల్లోకి వచ్చినప్పటి ఫొటోలను చూశారా? జనం భుజాలపై మోసుకొస్తున్న ఓ వ్యక్తిని గమనించారా? ఆ ర్యాలీకి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరో తెలుసా? అతను లష్కరే తోయిబాకు చెందిన అమీర్.. అని పేర్కొన్నాడు.
ఫైసలాబాద్ నుంచి అనేక మంది కశ్మీరు వెళ్లారని, కొందరు అక్కడ ప్రాణత్యాగం చేశారన్నాడు. అంతేకాదు, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాశ్మీర్ లేని పాకిస్థాన్ అసంపూర్ణమని, దేవుడి దయతో కాశ్మీరు ఏదో ఒక రోజు పాకిస్థాన్లో భాగమవుతుందని, భారత్ ముక్కలు చెక్కలు కావడాన్ని ప్రపంచం చూస్తుందని వ్యాఖ్యానించాడు.
కాగా, కాశ్మీరు అల్లర్ల వెనుక పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల పాత్ర ఉందని భారత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు సయీద్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. కాశ్మీరు అల్లర్ల గురించి పాకిస్థాన్ చేస్తున్న ప్రచారం తప్పని తేలింది.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ప్రజల్లో భారతదేశంపై వ్యతిరేకతను పెంచేందుకు కాశ్మీరు అల్లర్లను వాడుకోవాలని ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేస్తున్న ప్రయత్నాలకు హఫీజ్ సయీద్ వ్యాఖ్యలు గొడ్డలి పెట్టు అని పాకిస్థాన్కు చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు, అతని వ్యాఖ్యలు పాక్ను ఇరుకున పెట్టేవే అంటున్నారు.