పాక్ ఫలితాలు: చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ ఖాన్! ఏకమైన విపక్షాలు.. ఇదీ తొలిసారే!
కరాచి: మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎన్నికల బరిలో తన పార్టీని ఆధిక్యంలో నిలబెట్టడమే కాకుండా తాను పోటీ చేసిన అయిదు స్థానాల్లో గెలిచి రికార్డులకు ఎక్కారు.
ఒక్క సీటు రాలేదు ఎన్నికల ఫలితాలు: ఇమ్రాన్ వైపు పాకిస్తాన్ మొగ్గు, ఆయనకు శిక్షపడే ఛాన్స్
ఆయన ఎన్ఏ-26, బన్ను, ఎన్ఏ-61 రావల్పిండి, ఎన్ఏ-95 మియావలి, ఎన్ఏ-131 లాహోర్, ఎన్ఏ-243 కరాచీ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. రావల్పిండిలో తిరుగులేని శక్తిగా ఉన్న నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ను చిత్తుగా ఓడించారు. 1988 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పీఎంఎల్ఎన్ ఆరుసార్లు గెలిచింది.
తొలిసారి ఐదు పార్టీల ఆరోపణ
పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి ఐదు పార్టీలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నాయని పీఎంఎల్ఎన్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్, పోలింగ్ అధికారులపై పీఎంఎల్ఎన్ అనుమానాలు వ్యక్తం చేసింది. పాక్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి ఎక్కువ సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. బహిరంగ లెక్కింపుకు ఇమ్రాన్ పార్టీ సిద్ధమని ప్రకటించింది.
అతిపెద్ద పార్టీగా పీటీఐ
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి కేసులో జైలుకెళ్లడంతో క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఇమ్రాన్ ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. దేశ 70 ఏళ్ల చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న రెండో అధికార బదిలీ ప్రక్రియలో పీటీఐ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారు. పాకిస్తాన్లో ఏకైక అతిపెద్ద పార్టీగా స్వతంత్రులు లేదా ఇతర పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.
మేజిక్ ఫిగర్ 137
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 137 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నేరుగా ఎన్నికై ఉండాలి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుంటారు. అందులో 272 మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. 60 స్థానాలు మహిళలకు, పది స్థానాలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించారు.
మేజిక్ ఫిగర్కు దూరంలో పీటీఐ
ఐదు శాతం పైగా ఓట్లు వచ్చిన పార్టీలకు దామాషా పద్ధతిన స్థానాలు కేటాయించి వీరిని ఎంపిక చేస్తారు. మొత్తంగా 172 స్థానాలు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. పీటీఐ ముందంజలో ఉన్నప్పటికీ మేజిక్ ఫిగర్కు దూరంలోనే ఆగిపోయింది.