పుల్వామా తీవ్రవాద దాడి: స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని అభిప్రాయపడ్డారు. దాడిపై తమకు నివేదికలు అందాయని, తాను వాటిని పరిశీలించానని, అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయని చెప్పారు. ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని చెప్పారు.
భారత్, పాకిస్తాన్లు కలిసి ముందుకు నడిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నెల 14వ తేదీన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాది దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు స్పందించారు.
వైట్హౌస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ... దాడులపై భారతదేశంతో చర్చించామని చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్ పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామని వెల్లడించారు.
అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిప్యూటీ స్పోక్స్పర్సన్ రాబర్డ్ పల్లాడినో ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు భారత్కు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. అలాగే, పుల్వామా దాడి నిందితులను పాకిస్తాన్ కూడా శిక్షించాలని, ఈ మేరకు తాము అడుగుతామని చెప్పారు.