పాక్కు మోడీ దిమ్మతిరిగే షాక్, నీళ్లు వెళ్లకుండా నిర్ణయం: ఏమిటీ ఇండస్ వాటర్ ట్రీటీ?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్ను మన వైపు నుంచి భారత ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది! భారత్ నుంచి దాదాపు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇరవై మూడేళ్ల క్రితం పాకిస్తాన్కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ను రద్దు చేయడం, దిగుమతి సుంకంను 200 శాతం పెంచడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. పుల్వామా దాడికి జైష్ ఏ మొహమ్మద్ కారణం. జైష్ చీఫ్ మసూద్ అజహర్ పాక్లో హాయిగా ఉన్నాడు. భారత్ పైకి పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం పాక్కు చెమటలు పట్టించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
పాక్కు నీటి విడుదల నిలిపేయాలని కేంద్రం నిర్ణయం
ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తాజాగా ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్కు నీటి విడుదలను ఆపేయాలని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భారత్ నుంచి పాక్ వెళ్లే నీటిని ఇక మనమే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఇండస్ నదీ జలాలు దాయాది దేశానికి వెళ్లవని చెప్పారు. ఈశాన్య ప్రాంతం నుంచి పాక్కు వెళ్లే నీటిని మన కోసం తరలిస్తామని చెప్పారు. తద్వారా జమ్ము కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల ప్రజలకు ఈ నీటిని ఉపయోగిస్తామని తెలిపారు.
ఈ రాష్ట్రాల కోసం ఉపయోగిస్తాం
రావి నది పైన షహపూర్ - కంది ప్రాజెక్టు ప్రారంభమైందని గడ్కరీ పేర్కొన్నారు. అలాగే, యూజేఎహెచ్ ప్రాజెక్టులు మన భాగానికి వచ్చే నీటిని స్టోర్ చేస్తాయని, వాటిని జమ్ము కాశ్మీర్ కోసం ఉపయోగిస్తామని, మిగిలిన నీటిని ఇతర తీర ప్రాంత రాష్ట్రాలకు తరలిస్తామని చెప్పారు. రావి - బియాస్ ద్వారా పరివాహక ప్రాంతాలకు అందిస్తామని చెప్పారు. అన్ని ప్రాజెక్టులు కూడా నేషనల్ ప్రాజెక్టులుగా డిక్లేర్ చేసినట్లు తెలిపారు. ఇక్కడి నుంచి పారే నదీ జలాలపై పూర్తి హక్కులు భారత్వేనని చెప్పారు.
ఇండస్ వాటర్ ట్రీటీ ఏమిటి?
సింధు ఒప్పందం ప్రకారం సింధు బేసిన్లోని ఆరు నదులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై భారత్ - పాకిస్తాన్ దేశాలు అప్పట్లో సర్దుబాట్లు చేసుకున్నాయి. ఈ ఆరింటిలోని మూడు నదులపై భారత్కు, మూడు నదులపై పాకిస్థాన్ హక్కులు పొందింది. దీనిని ఇండస్ వాటర్స్ ట్రీటీ అంటారు. ఈ నదులని తూర్పు, పశ్చిమ నదులు అంటారు. 1960లో చేసుకున్న ధ్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. అలాగే, జీలం, చీనాబ్, సింధు నదులపై పాకిస్థాన్కు పూర్తి హక్కులు ఉన్నాయి. అయితే, భారత్ ప్రాజెక్టు నిర్మిస్తే పాక్కు ఆ నీళ్లు అందకుండా చేయొచ్చని గతంలో భారత్లో ఉగ్రదాడులు జరిగిన సమయాల్లోనూ చర్చ కొనసాగింది.