భారత్ దెబ్బ మీద దెబ్బ, దిగొచ్చిన పాకిస్తాన్: హఫీజ్ సంస్థతో పాటు రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం
న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ షాక్ మీద షాక్ ఇస్తోంది. ఓ వైపు ఆర్థికంగా, తన వద్ద ఉన్న వనరులతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాయాది దేశాన్ని ఇరుకున పడేస్తూనే, అంతర్జాతీయస్థాయిలో పాకిస్తాన్ను ఏకాకి చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
మోడీ ప్రభుత్వం దెబ్బ.. దిగొచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం
పాకిస్తాన్ ఉగ్రవాదానికి పుట్టినిల్లు అని తెలిసినప్పటికీ, ఈ చర్యల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే, భారత్ వరుస దెబ్బల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2016లో యూరీ ఘటనకు సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా బుద్ధి చెప్పిన మోడీ ప్రభుత్వం, ఇప్పుడు ఆర్థికంగా, అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తూ పాకిస్తాన్ దిగివచ్చేలా చేసింది. పాక్ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా అనేది వేరే విషయం.
రెండు ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తూ నిర్ణయం
పుల్వామా దాడి నేపథ్యంలో ఆగ్రహం చవిచూస్తున్న పాకిస్తాన్ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తూ పాకిస్తాన్ జాతీయ భద్రతా విభాగం కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒకటి జమాత్ ఉద్ దవా, రెండోది ఫలాహీ ఇన్సానియత్ ఫౌండేషన్. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిషేధం విధించింది. జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్. ఇది భారత్కు పెద్ద విజయంగా చెప్పవచ్చు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం తమ ప్రకటనలో.. నిషేధిత ఉగ్రవాద సంస్థలపై వేగవంత చర్యలపై ఈ కమిటీ చర్చించిందని పేర్కొంది. ఇందులో భాగంగా జమాద్ ఉద్ దవా, ఫలాహీ ఇన్సానియత్ ఫౌండేషన్ను నిషేధించామని పేర్కొంది.
ముంబై సూత్రధారి హఫీజ్ సయీద్
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఈ రెండు ఉగ్రవాద సంస్థలని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2008 ముంబై ఉగ్రవాద ఘటన మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్దే. గతంలో పాకిస్తాన్ లష్కరే తోయిబాను నిషేధించింది. దీంతో అతనే జమాత్ ఉద్ దవాను ప్రారంభించాడు.