అమెరికాకు రష్యా గట్టి షాక్: వాళ్లను వెనక్కి పంపించడానికి నిర్ణయం..
అమెరికన్ ఎంబసీ అధికారులను వెనక్కి పంపించే ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని తెలిపారు.
మాస్కో: అమెరికాతో సత్సంబంధాల కోసం వేచి చూసి విసిగిపోయామంటున్న రష్యా.. ఆ దేశానికి షాక్ ఇచ్చింది. రష్యా నుంచి 755మంది అమెరికా దౌత్య అధికారులను వెనక్కి పంపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రకటన చేశారు.
అమెరికన్ ఎంబసీ అధికారులను వెనక్కి పంపించే ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా యూఎస్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమే పుతిన్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.
గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, హిల్లరీపై ప్రతికూల ప్రభావం పడేలా దొంగచాటు వ్యవహారాలు నడిపించిందని యూఎస్ కాంగ్రెస్ విశ్వసిస్తోంది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న 35 మంది రష్యన్ దౌత్యవేత్తలను దేశం నుంచి పంపిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది.
ఈ పరిణామాలతో అమెరికా-రష్యా మధ్య సంబంధాలు ఆశాజనకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా నిర్ణయాన్ని తిప్పికొట్టేలా రష్యా సైతం ధీటుగా బదులివ్వడంతో.. భవిష్యత్తు సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రస్తుతం రష్యాలో 5అమెరికన్ ఎబసీలు ఉన్నాయి. వీటిలో 1200మందికి పైగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
రష్యా తాజా నిర్ణయంతో అన్ని ఎంబసీల్లోను కేవలం 455మంది అధికారులనే అమెరికా కొనసాగించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, అమెరికాలోని రష్యన్ ఎంబసీల్లోను కేవలం 455మంది క్రెమ్లిన్ అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు.