విమానంలో 110 మంది ప్రయాణికులు.. కూల్చేయమన్న పుతిన్!
మాస్కో: దాదాపు 110 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూల్చేయమని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు, 2014లో. అప్పట్లో పుతిన్ ఉన్నతాధికారులకు అలా ఆదేశాలు ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకోలేదట. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడే చర్యల్లో భాగంగా అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరిటో ఓ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు రెండు గంటలపాటు సాగే ఆ వీడియోలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
అసలేం జరిగిందంటే...
2014 ఫిబ్రవరి 7న సొచ్చిలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. వాటిని చూసేందుకు దాదాపు 40 వేల మంది ఔత్సాహికులు వచ్చారు. ఆ కార్యక్రమానికి పుతిన్ కూడా వెళ్లాల్సి ఉంది. సరిగ్గా అదేసమయంలో పుతిన్కు రష్యా నిఘా అధికారుల నుంచి ఓ ఫోన్కాల్ వచ్చింది. ఖర్కివ్ నుంచి ఇస్తాంబుల్కు ప్రయాణిస్తున్న ఓ టర్కీ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారనేది సమాచారం.
టర్కీ విమానంలో బాంబు...
టర్కీష్ పీగాసస్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737-800 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారని, అందులోని ఓ ప్రయాణికుడికి ఉగ్రవాదులు బాంబు కూడా అమర్చారని, ప్రస్తుతం ఆ విమానం ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న సొచ్చి వైపు దూసుకొస్తోందనేది ఫోన్కాల్ సారాంశం. దీంతో అప్రమత్తమైన పుతిన్ వెంటనే ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏం చేయాలనే విషయమై తర్జనభర్జన పడ్డారు.
కూల్చేయమన్న పుతిన్...
110 మంది ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యమా? లేక ఒలింపిక్స్ క్రీడలకు విచ్చేసిన వేలాదిమంది ప్రాణాలు ముఖ్యమా? ఇదీ అప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందున్న సమస్య. అయితే పుతిన్ వేలాదిమంది ప్రాణాలకే ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే వెంటనే ఆ విమానాన్ని కూల్చి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అ తరువాత ఆయన ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సొచ్చికి వెళ్లారు.
తీరా చూస్తే, అది ఫేక్ ఫోన్కాల్...
తీరా చూస్తే ఆ వచ్చింది ఫేక్ ఫోన్ కాల్. ఎందుకంటే, ఆ తరువాత మరికొద్ది సేపటికే ఆయనకు మరో ఫోన్కాల్ వచ్చింది. అంతకుముందు వచ్చిన కాల్ కేవలం బెదిరింపు కాల్ మాత్రమేనని, ఓ ప్రయాణికుడు తాగి విమానంలో గొడవ చేశాడని, ప్రస్తుతం ఆ విమానం టర్కీవైపే వెళుతోందని అధికారులు వివరించారు. దీంతో పుతిన్ ఊపిరిపీల్చుకున్నారట. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా ధ్రువీకరించారు.