పాకిస్తాన్ను ఆదుకున్న ఖతార్..భారీగా బెయిల్ఔట్ ప్యాకేజ్
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ను ఖతార్ ఆదుకునే ప్రయత్నం చేసింది. 3 బిలియన్ అమెరికా డాలర్లు పాకిస్తాన్కు ఖతార్ ఆర్థిక సహాయం చేసింది. పాకిస్తాన్లో ఖతార్ రాజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ పర్యటన తర్వాత ఈ భారీ బెయిల్ఔట్ ప్యాకేజీని ఖతార్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని, మనీలాండరింగ్కు పాల్పడదని, ఉగ్రవాదంకు ఆర్థిక సహాయం చేయదనే మాట తీసుకున్న తర్వాతే ఈ బెయిల్ఔట్ను ఖతార్ ప్రకటించడం విశేషం.
గల్ఫ్ ప్రాంతంలో పాకిస్తాన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దేశాల్లో ఖతార్ నాల్గవ దేశంగా నిలిచింది. ఇమ్రాన్ ఖాన్ అధికారం చేపట్టిన 11 నెలల్లో పాక్ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకుముందు చైనా 4.6 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆర్థిక సహాయం చేసింది. సౌదీ అరేబియా 3 బిలియన్ అమెరికన్ డాలర్లు, 3.2 బిలియన్ డార్లు విలువ చేసే చమురును సహాయం చేసింది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా 2 బిలియన్ అమెరికన్ డాలర్లు క్యాష్ రూపంలో డిపాజిట్ చేసింది.
ఇక బెయిల్ఔట్ ప్రకటించడంతో పాటు పాకిస్తాన్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఖతార్ ముందకొచ్చింది. ఇక రెండు దేశాల మద్య ఆర్థిక భాగస్వామ్యం విలువ 9 బిలియన్ డాలర్లు ఉంటుందని ఖతార్ విదేశాంగ మంత్రి తెలిపారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు నెరుపుతామని ఖతార్ పునరుద్ఘాటించింది. రాజకీయం, ఆర్థికంగా, క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండు దేశాల మధ్య సఖ్యత కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక పాకిస్తాన్కు భారీ బెయిల్ఔట్ ప్రకటించడంతో ఖతార్కు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారుడు డాక్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్.