టార్గెట్ చైనా... డ్రాగన్ ఆట కట్టించేందుకు సిద్దమైన 'క్వాడ్'... సమిష్టిగా ఎదుర్కోనున్న నాలుగు దేశాలు.
జపాన్లోని టోక్యో వేదికగా జరిగిన క్వాడ్ సమావేశంలో (క్వాడ్రిలాటరల్ డైలాగ్) అమెరికా,భారత్,ఆస్ట్రేలియా,జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. గతేడాది మొదటిసారిగా న్యూయార్క్లో క్వాడ్ సమావేశం జరగ్గా.. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది క్వాడ్ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే ఇండో-పసిఫిక్ సముద్ర జలాలపై చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఫ్రీ నేవిగేషన్ అవసరంపై నాలుగు దేశాలు చర్చించాయి.
Recommended Video
టూ ఫ్రంట్ వార్కి భారత్ సిద్దం... చైనా మనల్ని తట్టుకోలేదు... ఎయిర్ఫోర్స్ చీఫ్ కీలక ప్రకటన...
విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారు...
భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశకంర్,అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటేగి, ఆస్ట్రేలియా ఫారిన్ మినిస్టర్ మారిస్ పైన్ క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడుతూ... 'పరస్పర భాగస్వామ్య విలువలతో శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండో-పసిఫిక్ సముద్ర జలాలపై సమిష్టిగా స్వేచ్చ ప్రాధాన్యతపై మనమంతా దృష్టి సారించాం. చట్ట నియమాలు, పారదర్శకత, మహా సముద్రాలలో నావిగేషన్ స్వేచ్ఛ, ప్రాదేశిక సమగ్రత,సార్వభౌమత్వాన్ని గౌరవించడం,వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం వంటి అంశాల సమర్థనకు కట్టుబడి ఉన్నాం. ఇండో పసిఫిక్ రీజియన్లో చట్టబద్ధమైన, కీలకమైన ప్రయోజనాలను కలిగి ఉన్న అన్ని దేశాల భద్రత, ఆర్థిక ప్రయోజనాల అభివృద్ధే మన లక్ష్యం. దీనిపై మన వాదనలకు విస్తృత ఆమోదం పొందడం సంతృప్తికరమైన విషయం.' అన్నారు.
చైనా పేరెత్తిన మైక్ పాంపియో...
సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఒక్కరే చైనా పేరు ప్రస్తావించడం గమనార్హం. 'క్వాడ్ భాగస్వామ్యులుగా గతం కంటే ఇప్పుడు మన ప్రజలను,భాగస్వామ్య దేశాలను చైనా దోపిడీ,అవినీతి,దూకుడు నుంచి కాపాడుకోవడం మరింత క్లిష్టంగా మారిందన్నారు. అటు తూర్పు, దక్షిణ చైనా సముద్రంపై,ఇటు తైవాన్ జలసంధిపై ఆక్రమణకు ప్లాన్ వేసిన చైనా... మరో పక్క భారత్తో సరిహద్దులో ఉద్రిక్తతలకు తెరదీస్తోంది...' అని పేర్కొన్నారు. గతేడాది న్యూయార్క్లో క్వాడ్ సమావేశానికి... ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందన్నారు.
చైనాను ఎదుర్కొనేందుకు సమిష్టిగా...
ఇండో- ఫసిఫిక్ సముద్రజలాలపై ఆధిపత్యం సాధించే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలను సమిష్టిగా తిప్పికొట్టడంతో పాటు అక్కడ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనమంతా కృష్టి చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు.చైనా నుంచి కరోనా వైరస్ పుట్టుకొస్తుందని మనమెవరం ఊహించలేదన్న పాంపియో... చైనా నిజాలను దాచిపెట్టడం వల్లే ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. నిజానికి చైనీస్ పౌరులు కరోనా వైరస్పై మొదటి నుంచి గొంతెత్తుతున్న అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం బలవంతంగా వాళ్ల నోళ్లు మూయించిందన్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణానికి క్వాడ్ సభ్య దేశాలుగా పరస్పర సహకారంతో ముందుకు సాగుదామన్నారు.
చైనా ఆట కట్టించేందుకు...
మొత్తం మీద చైనా ఆట కట్టించేందుకు ఈ నాలుగు దేశాలు సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగనున్నాయి. సరిహద్దులో భారత్ను కవ్వించడం,ఇండో పసిఫిక్,దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా దుందుడుకు చర్యలను తిప్పికొట్టడం పైనే ఈ దేశాలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఇందుకోసం పరస్పర సమాచార మార్పిడి,సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకోనున్నాయి. అలాగే నాలుగు దేశాలు సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే తాజా సమావేశంలో మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.