చలించిన భారత్, అమెరికా 10లక్షల డాలర్ల సాయం, రాయబారి కూతురు మృతి
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: నేపాల్లో వచ్చిన భూకంపంపై ప్రపంచ దేశాలు చలించిపోయాయి. భారత్ కూడా వెంటనే స్పందించింది. తక్షణం ఆపన్న హస్తం అందించింది. జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ బృందం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది హుటాహుటిన నేపాల్కు వెళ్లారు. ఢిల్లీలోని హిండాన్ ఎయిర్ బేస్ నుంచి వైమానిక దళానికి చెందిన సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానంలో నేపాల్కు వెళ్లారు.
సహాయ చర్యలు మొదలుపెట్టారు. భూకంప కేంద్రమైన పొఖారాలో పరిస్థితి, భూమార్గంలో అక్కడికి చేరుకునేందుకు ఉన్న అవకాశాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. 40 మంది వైద్య సిబ్బంది ఔషధాలు, ఇతర వైద్య పరికరాలతో నేపాల్ చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించే పరికరాలు, జాగిలాలు, ఇతర అత్యాధునిక పరికరాలు, సహాయ సామగ్రిని నేపాల్కు పంపించారు.
మొత్తం పదిహేను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నారు. అవసరాన్ని బట్టి తక్షణం నేపాల్లో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భారత సైన్యం, బీఆర్వో, వైమానిక దళ సిబ్బంది, విమానాలు, హెలికాప్టర్లను, ఇతర వాహనాలను సిద్ధంగా ఉంచారు.
భారత తక్షణ స్పందన పట్ల, ఢిల్లీలోని నేపాల్ రాయబారి (ఇన్చార్జి) దిలీప్ కుమార్ ఉపాధ్యాయ కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశానికి తక్షణం సంచార వైద్య సేవలు అవసరమన్నారు. నేపాల్కు తక్షణం 20వేల ఆహార పొట్లాలను పంపనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఉదయన్నే వైద్యులు, ఇంజనీర్లు, సహాయ సామగ్రితో ప్రత్యేక విమానాన్ని ఖాట్మండుకు పంపుతోంది.
అవసరమైన సహాయం చేస్తామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. నేపాల్లో సంభవించిన భారీ భూకంపంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా సమీక్షించారు. నేపాల్కు తక్షణం సహాయ సిబ్బందిని పంపాలని అమెరికా నిర్ణయించింది. నేపాల్కు పది లక్షల డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. నేపాల్ ప్రధానితో ప్రధాని మోడీ మాట్లాడారు. చైనా కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తమకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని నేపాల్ కోరింది.
భారత రాయబార కార్యాలయ ఉద్యోగి కుమార్తె మృతి
ఖాట్మాండులో నివసిస్తున్న భారత రాయబార కార్యాలయ ఉద్యోగి కుటుంబంలో భూకంపం విషాదం నింపింది. ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్న మదన్ కుమార్తె మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. రాయబార భవన సముదాయంలోని వారి నివాస గృహం కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని సుష్మా స్వరాజ్ విచారం వ్యక్తం చేశారు. భూకంపం కారణంగా మరో భారతీయుడు మృత్యువాత పడ్డారు.