కఠిన నిర్ణయం, టీవీ లైవ్లో ఏడ్చిన యాంకర్, ఒత్తిళ్లతో వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా తరలి వస్తున్నారంటూ ట్రంప్ ప్రభుత్వం వలసదారులను నిర్బంధించిన వార్త చదివే క్రమంలో ఓ టీవీ యాంకర్ ఉద్వేగానికి లోనయ్యారు. అక్రమ వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేసి నిర్బంధించాలనే కఠినమైన ఉత్తర్వులను ట్రంప్ మొదట తీసుకు వచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు.
అయితే, వలసదారుల నుంచి పిల్లలను వేరే చేసే వార్తను చదువుతు ఓ మహిళా యాంకర్ ఉద్వేగానికి లోనయ్యారు. మంగళవారం వార్తలు చదువుతున్న టీవీ యాంకర్ భావోద్వేగానికి గురై.. ఆ న్యూస్ చదవలేక లైవ్లోనే ఏడ్చేసింది. ఎంఎస్ఎన్బీకి చెందిన యాంకర్ రేచల్ మాడో... ఇప్పుడే అందిన వార్త అంటూ తల్లిదండ్రులు కనిపించక పిల్లలు ఏడుస్తున్నారని వార్త చదివేసరికి కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత తేరుకొని వార్తలను పూర్తి చేసింది. దీనిపై ఆమె తర్వాత ట్వీట్ చేశారు. వార్త విన్న తర్వాత తనను తాను నియంత్రించుకోలేకపోయానని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు, బుధవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో తల్లితండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్భందించే విధానానికి స్వస్తి పలుకుతూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా ప్రస్తుత విధానం ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల కొన్ని వారాల సమయాల్లోనే దాదాపు 2500 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిబిరాలకు తరలించారు. కుటుంబాల నుంచి వారిని వేరు చేయడంతో పిల్లలు ఏడుస్తున్న ఫోటోలు, వారిని బోనుల్లాంటి ప్రదేశాల్లో నిర్బంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేసే విధానాన్ని తొలగించాలని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తన భర్తను వేడుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఆ పాలసీని నిలిపేయాలని ఆమె కోరినట్లు తెలిపారు. కుటుంబాలను కలిపి ఉంచేందుకు మీ వల్ల అయినదంతా చేయమని ఆమె వేడుకున్నారని మెలానియా కార్యాలయ వర్గాలు తెలిపాయి. కూతురు ఇవాంకా ట్రంప్ కూడా దీనిని తప్పుబట్టారు. పైగా అంతర్జాతీయంగా ఒత్తిళ్లు రావడంతో ట్రంప్ ఈ విధానానికి స్వస్తీ పలికారు.