లైవ్ ప్రోగ్రామ్ లో రేడియో జాకీ దారుణ హత్య
బ్రెజిల్: రేడియో జాకీని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన బ్రెజిల్ లో జరిగింది. లైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగానే రేడియో స్టేషన్ లో చోరబడిన దుండగులు రేడియో జాకీని అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు రేడియో జాకీని హత్య చేశారని పోలీసు అధికారులు తెలిపారు.
బ్రెజిల్ పోలీసు అధికారుల కథనం మేరకు జోవా వెల్డసిర్ డీ బోర్బా (52) బ్రెజిల్ రేడియో డిప్యు సొరా ఏఎమ్ లో వ్యాఖ్యాత (రేడియో జాకీ)గా పని చేస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి ఆయన నేర సంఘటనలు (క్రైం) రిపోర్టు చేసే కార్యక్రమంలో పని చేసేవారు. ఇటీవల బోర్బా సంగీత కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ముసుగులు వేసుకుని రేడియో కార్యాలయంలోకి వెళ్లారు. రేడియో కార్యక్రమంలో ఉన్న బోర్బాను అతి దారుణంగా రివాల్వర్లతో కాల్చి పరారైనారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
చికిత్స విఫలమై బోర్బా మరణించాడని పోలీసులు అన్నారు. ఈ విషయంలో బోర్బా స్నేహితుడు మీడియాతో మాట్లాడుతూ తాను సిగరేట్ తాగడానికి బయటకు వెళ్లి వచ్చే లోపు ఈ దారుణం జరిగిందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. బోర్బా క్రైం రిపోర్టులు చేసే సమయంలో అనేక బెదిరింపులు వచ్చాయని, అందుకే ఆయన హత్యకు గురైయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు.