సీబీఐకి రాజీవ్ ఈ-మెయిల్.. విచారణకు హాజరయ్యేందుకు ఏం చెప్పాడంటే ...
కోల్కతా : శారదా చిట్ ఫండ్ స్కాంలో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేయగా మాజీ కోల్ కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ గైర్హజరయ్యారు. అయితే ఇవాళ సాయంత్రం సీబీఐ అధికారులకు ఈ-మెయిల్ చేశారు రాజీవ్ కుమార్. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని అందులో కోరారు.
వాస్తవానికి ఇవాళ సీబీఐ విచారణకు రాజీవ్ కుమార్ హాజరుకావాలి. కానీ హాజరుకాకపోవడంతో ఈ మెయిల్ చేశారు. దీనిని సీబీఐ అధికారులు తమ లాయర్ దృష్టికి తీసుకొచ్చారు. తమ లాయర్ వైజే దస్తూర్కు ఈ విషయాన్ని కూడా తెలిపారు. ఈ కేసులో సీబీఐ వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతుందని సమాచారం. శారదా స్కాంలో తనను విచారించొద్దని రాజీవ్ అభ్యర్థనపై ఉన్న స్టేను నిన్న కోల్ కతా హైకోర్టు ఎత్తివేసింది. దీంతో సీబీఐ అధికారులు ఆయన ఇంటి వద్ద నోటీసులు అతికించారు.
బెంగాల్లో శారదా చిట్ ఫండ్ స్కాం జరిగింది. 2014లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. శారదా గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ పేరుతో రూ.2500 కోట్లను ఖాతాదారుల నుంచి వసూల్ చేశారు. ఆ నగదు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. అప్పటి పోలీసు ఉన్నతాధికారి రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో సీబీఐ అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అందుకు ఇదివరకు కోల్ కతా హైకోర్టు అంగీకరించగా .. తాజాగా విరమించుకుంది.దీంతో రాజీవ్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు.