పాక్ లో రాజ్ నాథ్ సింగ్: మాలిక్ భార్య నిరాహారదీక్ష
ఇస్లామాబాద్: సార్క్ సమావేశాలలో పాల్గోనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పాక్ అధికారులు రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికారు.
తరువాత సాయుధ బలగాల కాన్వాయ్ లో రాజ్ నాథ్ సింగ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. రాజ్ నాథ్ సింగ్ పర్యటనను వ్యతిరేకిస్తు రెండు వేల మందికి పైగా విమానాశ్రం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.
హిజబుల్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయిద్ సలావుద్దీన్ ధర్నాకు నేతృత్వం వహించారు. పాక్ లోని పలు నగరాల్లో రాజ్ నాథ్ సింగ్ గో బ్యాక్ అంటూ నిరసనలు చేపట్టారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాసిన్ మాలిక్ భార్య నిరాహార దీక్ష....... రెచ్చగొడుతున్న నవాజ్ షరీఫ్
జమ్మ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్ తో పాటు పలువురు నిరాహార దీక్షలు మొదలు పెట్టారు. రాజ్ నాథ్ సింగ్ సార్క్ సమావేశాల్లో పాల్గోనరాదని, వెంటనే ఆయన తిరిగి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు.
రాజ్ నాథ్ సింగ్ దిష్టిబొమ్మలు తగలబెట్టిన ఆందోళనకారులు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. పాక్ విదేశాంగ విధానానికి మూలస్తంభం కాశ్మీర్ అనే వివాదాన్ని మరింత రెచ్చగొట్టారు.
రాజ్ నాథ్ సింగ్ సార్క్ హోం మంత్రుల సమావేశంలో పాల్గొంటారని, పాకిస్తాన్ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపే ఉద్దేశం ఏమి లేదని భారత విదేశాంగ శాఖ ఇంతకుముందే స్పష్టం చేసింది. మొత్తం మీద రాజ్ నాథ్ సింగ్ పర్యటనను పాక్ లో తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.