ఎఫ్3: అంతరిక్షంలో అద్భుతం: 20 రోజులపాటు క్లియర్గా: వాయవ్య దిశగా: సూర్యాస్తమయం తరువాత
వాషింగ్టన్: అంతరిక్షం..అద్భుతాల మయం. అంతుచిక్కని, అంతే లేని రహస్యాలకు నిలయం. దశాబ్దాలుగా కొనసాగుతోన్న అంతరిక్ష పరిశోధనల సందర్భంగా వెలుగులోకి వచ్చే ప్రతి అంశం కూడా ఒక్కో అద్భుతమే. అంతరిక్షానికి సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా ఆసక్తి కలిగించేదే.. ఆశ్చర్యానికి గురి చేసేదే. అలాంటి ఉదంతమే మరోసారి చోటు చేసుకోబోతోంది. నాసా శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఓ తోకచుక్క భూగోళం చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి దీన్ని స్పష్టంగా చూడొచ్చు .
Recommended Video
సీ/2020 ఎఫ్3 నియోవైజ్గా
ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఈ తోకచుక్కను కనుగొన్నారు నాసా శాస్త్రవేత్తలు. దీనికి సీ/2020 ఎఫ్3 నియోవైజ్గా నామకరణం చేశారు. అప్పటికే ఇది పాలపుంత చుట్టూ చక్కర్లు కొట్టడం ఆరంభించింది. ఈ నెల 3వ తేదీన సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిందీ తోకచుక్క. 43 మిలియన్ కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొట్టింది. సూర్యుడు, మెర్క్యురి మధ్య గల దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇది తక్కువే. క్రమంగా భూమి వైపు పయనిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి భూమికి అత్యంత దగ్గరగా తిరుగాడబోతోంది.
సూర్యాస్తమయం తరువాత.. వాయవ్య దిశలో...
ఈ నెల 14వ తేదీ నుంచి సుమారు 20 రోజుల పాటు ఈ తోకచుక్క భూమి చుట్టూ పరిభ్రమిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడు అస్తమించిన తరువాత.. వాయవ్య దిక్కున ఈ తోకచుక్కను స్పష్టంగా చూడొచ్చని వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ను నాసా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి తీసిని వీడియోలు, ఫొటోలను వారు బహిర్గతం చేశారు. సూర్యాస్తమయం తరువాత.. లేత చీకట్లు అలుముకునే సమయంలో 20 నిమిషాల పాటు ఈ తోకచుక్కను చూడొచ్చని అన్నారు.
ఈ నెల 22, 23 తేదీల్లో
ఈ నెల 22, 23 తేదీల్లో నియోవైజ్ తోకచుక్క భూమికి మరంత దగ్గరగా వస్తుందని, ఆ సమయంలో అది అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. భారత్ సహా అన్ని దేశాల్లోనూ ఎలాంటి పరికరాలు లేకుండా నేరుగా ఈ తోకచుక్కను చూడొచ్చని అన్నారు. ఆగస్టులో పాలపుంతకు అవతలకు దూసుకెళ్తుందని, క్రమంగా అంతరించే అవకాశం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తోకచుక్క సుమారు అయిదు కిలోమీటర్ల పొడవు ఉండటం, భూమికి అత్యంత సమీపానికి రావడం వల్ల దీన్ని చూడొచ్చని చెప్పారు.
1990 తరువాత తొలిసారిగా..
తోకచుక్కక దుమ్ము, ధూళితో నిండి ఉంటుందని, 1990ల తర్వాత అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క ఇదేనని వెల్లడించారు. ఈ శతాబ్దానికి మనుషులు చూడగలిగే మొట్టమొదటి తోకచుక్క ఇదేనని అన్నారు. పాలపుంతను దాటుకుని వెళ్లిన తరువాత.. దాని రాక మరోసారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అది మళ్లీ పాలపుంతలోకి ప్రవేశించడానికి ఎన్నేళ్లు పడుతుందనేది ఇప్పుడిప్పుడే అంచనా వేయలేమని తెలిపారు. దాని వేగం మాత్రం అంచనాలకు మించి కనిపిస్తోందని చెప్పారు. సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన తరువాత.. కొద్దిరోజుల వ్యవధిలోనే అది భూమికి సమీపించబోతుండటం దీనికి నిదర్శనమి అన్నారు.