ఇంట్రెస్టింగ్ : జపాన్ తీరంలో ప్రత్యక్షమైన అరుదైన చేపలు... సునామీకి సంకేతమా..?
జపాన్ : జపాన్లో సునామీ రానుందా... మరోసారి 2011 నాటి భయానక దృశ్యాలు జపాన్లో చూడాల్సి వస్తుందా... జపాన్ను మరోసారి సముద్రతల్లి ఆగ్రహానికి గురికానుందా..? మరి అక్కడి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు..? సునామీ వచ్చే అవకాశం ఉందంటూ ఎందుకు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు..? తెలియాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ.
2011లో జపాన్ను ఛిన్నాభిన్నం చేసిన భూకంపం, సునామీ
జపాన్.. ఈ దేశంలో ఎక్కువగా భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. ఒక్కసారి ప్రకృతి పంజా విసిరిందంటే చాలు భారీ ప్రాణనష్టం, భారీ ఆస్తినష్టం తప్పదు. అప్పుడెప్పుడో 2011లో సునామీ ఆ దేశాన్ని ఛిన్నాభిన్నం చేసింది. సముద్రంలో ఏర్పడిన భూకంపంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. క్షణాల్లో రాకాసి అలలు దేశంలోని అధికభాగాన్ని నాశనం చేసేశాయి. ప్రకృతి మిగిల్చిన గాయం నుంచి కోలుకుని జపాన్ మళ్లీ యథాస్థితికి చేరుకుంది. ఇప్పుడు జపాన్ వాసులను మరోసారి సునామీ కలవరపెడుతోంది. ప్రజలు సునామీ వస్తుందేమో అని భయపడుతున్నారు.
జపాన్ తీరంలో అరుదైన ఓర్ జాతి చేపలు
జపాన్లో సునామీ వస్తుందని ఏ వాతావరణ కేంద్రం చెప్పలేదు. కానీ అక్కడి ప్రజలు మాత్రం సునామి వస్తుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం తొయోమా సముద్రతీరంలో రెండు అరుదైన ఓర్ జాతికి చెందిన చేపలు కొట్టుకొచ్చాయి. ఇవి సముద్రంలో చాలా లోతులు కనిపిస్తాయి. సాధారణంగా ఇవి తీరానికి రావు. అలాంటిది ఇవి తీరానికి కొట్టుకురావడం జాలర్ల వలలకు చిక్కడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ముందుగా 10.5 అడుగుల పొడవున్న చేప తీరానికి కొట్టుకొచ్చింది. అనంతరం మరో 13 .12 అడుగుల చేప ఇమిజు పోర్టు తీరంలో కొట్టుకొచ్చింది. నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం పాములా ఉన్న ఈ చేప దాదాపు 20 అడుగల వరకు ఉంటుందట.
చేపలు ప్రత్యక్షమవ్వడం మరో సునామీకి సంకేతమా..?
ఈ చేపలు తీరానికి కొట్టుకొచ్చిన సమయంలో ఏదో ప్రళయం సంభవిస్తుందని అక్కడి స్థానికులు బావిస్తారు. అంతేకాదు ఈ ఓర్ ఫిష్ను జపాన్లో నమాజు అని పిలుస్తారు. ఈ చేపలు తమంతకు తామే సముద్ర తీరంకు వచ్చాయంటే త్వరలో ఏదో ప్రళయం జరగబోతోందనే సంకేతాలు ఇచ్చినట్లు అని జపాన్ వాసులు ప్రగాఢంగా నమ్ముతారు. ఉదాహరణకు భూకంపం కానీ సునామీ కానీ సంభవించే అవకాశం ఉన్నట్లు స్థానికులు భావిస్తారు. ఎప్పుడైతే ఓర్ చేపలు జపాన్ బీచ్లపై దర్శనమిస్తాయో అప్పుడు సముద్రగర్భంలో ఏదో అలజడి ప్రారంభమైందని గ్రహించాల్సి ఉంటుందట. అయితే ఈ జాతి చేపలు దర్శనమిస్తే భూకంపాలు వస్తాయని, సునామీలు వస్తాయనే వాదనను పూర్తిగా కొట్టి పారేయలేకున్నారు శాస్త్రవేత్తలు.
ఓర్ చేపలు బయటపడ్డాకే 2011లో భారీ సునామీ
అయితే ఈ ఓర్ జాతికి చెందిన చేపలు కీడుకు చిహ్నం అని చెప్పేందుకు చాలా ఘటనలే జపాన్లో నిదర్శనంగా నిలిచాయి. 2010లో దాదాపు డజనుకు పైగా ఓర్ చేపలు సముద్రతీరానికి కొట్టుకొచ్చాయి. అంతే కొన్ని నెలలకు అంటే మార్చి 2011లో జపాన్లోని ఫుకుషిమా నగరాన్ని భూకంపం భూస్థాపితం చేసింది. నాడు వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 9గా నమోదైంది. దీంతో పాటే సునామీ కూడా రావడంతో 15,894 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ 2500 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇక అప్పటి నుంచి ఈ ఓర్ చేపలు తీరానికి కొట్టుకొచ్చినప్పుడల్లా ప్రకృతి విపత్తుల రూపంలో కీడు జరుగుతుందేమో అనే అనుమానం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
మరి ఈ ఓర్ ఫిష్ తీరానికి కొట్టుకురావడంతో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. నిజంగానే జపాన్ను ప్రకృతి విపత్తులు ముంచేస్తాయా లేక అది కేవలం అపోహగానే చూడాలా అన్నది తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో మాత్రం నెటిజెన్లు జపాన్కు త్వరలోనే ప్రమాదం పొంచి ఉందనే కామెంట్స్ పెడుతున్నారు.