భారత్ పై చైనా మరో కుట్ర- ఆప్ఘన్, నేపాల్ కు భారీ ఆఫర్లు... పాక్ ను చూసి నేర్చుకోవాలంటూ..
భారత్ సైన్యంతో గల్వాన్ లోయ ఘటన తర్వాత మారిన పరిస్ధితుల్లో పొరుగుదేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా తాజాగా ఇలాంటిదే మరో ప్రయత్నం చేసింది. తమ సరిహద్దులనూ పంచుకుంటున్న ఉన్న పాకిస్తాన్, నేపాల్, ఆప్ఘనిస్తాన్ విదేశాంగమంత్రులతో చైనా ఓ సంయుక్త భేటీ ఏర్పాటు చేసింది. పేరుకి ప్రధాన అజెండా కరోనాయే అయినా భారత్ కు వ్యతిరేకంగా ఎలా ఏకమవ్వాలనే విషయంలో వారికి దిశా నిర్దేశం చేసింది. ఈ విషయంలో పాకిస్తాన్ ను చూసి నేర్చుకోవాలని కూడా చైనా వారికి సూచించింది.
Recommended Video
షాకింగ్: చైనా పైకి అమెరికా యుద్ధవిమనాలు - షాంఘైకి అతి సమీపంగా చక్కర్లు - తీవ్ర ఉత్కంఠ
మరో భారత్ వ్యతిరేక కుట్ర...
గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్ తమపై కత్తులు దూస్తుండటంతో ఉపఖండంలోని ఇతర శక్తులతో కలిసి దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్త్తోంది. ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి సరిహద్దు వివాదాలను
తెరపైకి తెచ్చేలా చేస్తున్న చైనా.. ఇప్పుడు ఏకంగా నేరుగా రంగంలోకి దిగుతోంది. తాజాగా పాకిస్తాన్, నేపాల్, ఆప్ఘనిస్తాన్ విదేశాంగమంత్రులతో చైనా వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఈ ఈ మూడు దేశాల మంత్రులకు దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కరోనాను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే అయినా కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్దలను ఎలా పునరుద్ధరించుకోవాలన్న అంశంపైనా చర్చించారు.
ఆర్ధిక వ్యవస్ధలకు సాయం పేరుతో...
కరోనా నేపథ్యంలో భారత్, చైనాతో పాటు నేపాల్, ఆప్ఘన్, పాకిస్తాన్ వంటి దేశాల ఆర్ధిక వ్యవస్దలు కూడా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. అయితే ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడంలో అనుభవమున్న చైనా.. ఇప్పుడు ఈ మూడు దేశాలకు ఆర్ధిక పాఠాలు నేర్పుతోంది. కరోనా ప్రభావం తగ్గాక ఆర్ధికవ్యవస్ధలను గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలను చైనా విదేశాంగమంత్రి ఈ మూడు దేశాలతో పంచుకున్నారు. వీటితో పాటు ఆర్ధిక వ్యవస్ధలను కలిపేందుకు చైనా నిర్మిస్తున్న ప్రతిపాదిత బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) పైనా ఈ మూడు దేశాల సహకారం కోరినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ ను చూసి నేర్చుకోండి..
కరోనా నుంచి కోలుకున్నాక ఆర్ధిక వ్యవస్ధలను గాడిన పెట్టేందుకు చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఈ నాలుగు సూత్రాల ప్రణాళికను మూడు దేశాల ముందుంచారు. అంతిమంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధకు సహకారం అందించడం ద్వారా కరోనాపై పోరుకు సహకరించాలని కోరారు. అదే సమయంలో చైనా నిర్మిస్తున్న ప్రతిపాదిత బీఆర్ఐకి కూడా సహకారం కోరారు. మనమంతా ఉమ్మడిగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళితేనే ఈ పోరులో విజయం సాధించగలమని మూడు దేశాలకూ చైనా విదేశాంగమంత్రి తన మనసులో మాటను వెల్లడించారు. అదే సమయంలో చైనాకు అన్నివిధాలా సహకరిస్తున్న "ఐరన్ బ్రదర్" పాకిస్తాన్ ను చూసి ఆప్ఘన్, నేపాల్ నేర్చుకోవాలని కూడా సూచించారు.
పెద్దన్న పాత్ర కోసం తహతహ..
భారత్ తో సరిహద్దు వివాదం తర్వాత అంతర్జాతీయ సమాజం తమపై శీతకన్ను వేసిందని భావిస్తున్న చైనా.. కనీసం ఉపఖండంలో అయినా పెద్దన్న పాత్ర పోషించాలని తహతహలాడుతోంది. అందుకే భారత్ కు గతంలో బలమైన మిత్రదేశాలుగా ఉన్న నేపాల్, ఆప్గన్ లను చేరదీసేందుకు సిద్ధమవుతోంది. ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న ఆయా దేశాల్లో భారీ ప్రాజెక్టులకు హామీ ఇవ్వడం ద్వారా వారిని తమవైపుకు తిప్పుకోవాలని యోచిస్తోంది. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నేపాల్ పరిస్ధితి ఎలా ఉన్నా ఆప్ఘనిస్తాన్ మాత్రం భారత్ ను కాదని చైనాతో బంధం కోసం సిద్ధం కాబోదని తెలుస్తోంది.