అమెరికా ఎన్నికల్లో రికార్డు స్ధాయి ముందస్తు పోలింగ్- ఓటేసిన 2.2 కోట్ల మంది
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులకే కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఓటర్లపైనా ఆ ప్రభావం పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ రోజు కంటే ముందే పలు మార్గాల్లో ఓటర్లు రికార్డు స్ధాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు పోలింగ్లో ఇప్పటివరకూ 2.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. వీరంతా వ్యక్తిగతంగా కానీ మెయిల్ ద్వారా కానీ తమ ఓటు వేసినట్లు అధికారులు నిర్ధారించారు. 2016లో ఇదే సమయంలో జరిగిన ఓటింగ్లో కేవలం 60 లక్షల మంది మాత్రమే ఈ విధంగా ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారంటే పరిస్ధితి తీవ్రత అర్ధమవుతోంది. కరోనా భయాల కారణంగా పోలింగ్ రోజు క్యూలైన్లలో నిలబడి ఓటు వేయడం కష్టమనే అంచనాకు రావడం వల్లే జనం ఇంత భారీ స్ధాయిలో ముందస్తు ఓటింగ్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ ముందస్తు ఓటింగ్లో డెమోక్రాట్లే ఎక్కువగా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నట్లు తాజా ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఓటేసిన వారిలో రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మహిళలు, నల్లజాతీయులు కూడా ఎక్కువగా ఓట్లు వేస్తున్న వారిలో ఉన్నట్లు సమాచారం. వీరిలో అత్యధికులు డొనాల్డ్ ట్రంప్పై కోపంతోనూ, వర్ణవివక్షకు వ్యతిరేకంగానూ ఈ ఓటింగ్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మిన్నెసోటాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ను పోలీసులు కొట్టి చంపడం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతున్న అంశంగా చెబుతున్నారు.
ముందస్తు ఎన్నికల పోలింగ్ డెమోక్రాట్లకు అనుకూలంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో రిపబ్లికన్లు మాత్రం వీటిలో అక్రమాలకు ఎక్కువగా అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ముందస్తు ఓటింగ్లో డెమోక్రాట్లు ఎక్కువగా పాల్గొన్నా రిపబ్లికన్లు మాత్రం అసలు పోలింగ్ రోజు సత్తా చూపుతామని చెబుతున్నారు. అయితే ముందస్తు ఓటింగ్లో అక్రమాలు జరిగే అవకాశం కేవలం ఒక్కశాతం కూడా లేదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2008 తర్వాత నల్లజాతి యువత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొంటున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి.