ఆకాశంలో మరో అద్భుతం: భూమికి అత్యంత దగ్గరలో అంగారకుడు
Recommended Video
జూలై 27న ఆకాశంలో ప్రపంచం ఓ అద్భుతాన్ని వీక్షించింది. సుదీర్ఘ చంద్రగ్రహాణాన్ని అంతా చూశాము. అంతేకాదు అరుణగ్రహం భూమికి దగ్గరగా రావడం కూడా కనిపించింది. చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోవడం చూశాం. ఇలాంటి అద్భుత ఘటన మరవక ముందే... ఆకాశంలో మరొక అద్భుతం చోటుచేసుకోనుంది. అంగారక గ్రహం ఈ రోజు భూమికి అత్యంత దగ్గరగా రానుంది. 15 ఏళ్ల క్రితం అంగారక గ్రహం భూమికి సమీపంలోకి వచ్చింది.
మంగళవారం అంగారక గ్రహం భూమికి 57.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో రానుంది. సాధారణంగా అంగారక గ్రహం ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే మంగళవారం భూమికి సమీపంలోకి రానుండటంతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే ఈ సుందర దృశ్యాన్ని టెలిస్కోప్ ద్వారా చూసేందుకు అంగారక గ్రహం చుట్టూ ఏర్పడ్డ దుమ్ము ధూళి అడ్డుగా నిలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహం చుట్టూ ఏర్పడ్డ దుమ్ము ధూళితో నాసాకు చెందిన రోవర్ కూడా ఎలాంటి సమాచారం చేరవేయడం లేదు. కనీసం సూర్య కిరణాలు కూడా రోవర్ సోలార్ ప్యానెల్స్ పై పడటం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.
60వేల సంవత్సరాల తర్వాత అంగారకుడు భూమి దగ్గరగా వచ్చాయని... అప్పుడు వీటి మధ్య దూరం 55.7 మిలియన్ కిలోమీటర్లుగా ఉన్నిందని శాస్త్రవేత్తలు చెప్పారు. మళ్లీ ఇంత దగ్గరగా 23వ శతాబ్దంలోనే వస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. అయితే ఇంత దగ్గరలో కాకపోయినప్పటికీ 2020లో అంగారక గ్రహం భూమికి 62 మిలియన్ కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుందని చెప్పారు. ఇక ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఆయా దేశాల శాస్త్రవేత్తలు అంగారకుడు భూమిని అత్యంత దగ్గరగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.