రూ.10 కోట్లివ్వు: రెహామ్ ఖాన్కు ఇమ్రాన్ కంటే ముందు భర్త నోటీసులు
కరాచీ: తన మాజీ భార్య రెహామ్ ఖాన్ పైన డాక్టర్ ఇయాజ్ రెహ్మాన్ రూ.100 మిలియన్ల పరువు నష్టం దావా వేశాడు. మాజీ బీబీసీ యాంకర్ రెహామ్ ఖాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ను ఏడాది క్రితం పెళ్లి చేసుకొని, ఇటీవలే విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
రెహామ్ ఖాన్కు ఇమ్రాన్ ఖాన్ రెండో భర్త. రెహామ్ ఖాన్ అంతకుముందు ఇయాజ్ రెహ్మాన్ను పెళ్లి చేసుకొని, అతనికి కూడా విడాకులు ఇచ్చింది.
తనకు పరువు నష్టంగా రూ.100 మిలియన్లు ఇవ్వాలని, అలాగే మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పాలని ఇయాజ్ రెహ్మాన్... రెహామ్ ఖాన్కు నోటీసులు పంపించాడు. అతని తరఫు న్యాయవాది తారిక్ మహమూద్ జహంగిరి నోటీసులు పంపించారు.
తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఆ తాఖీదుల్లో పేర్కొన్నారు. లండన్లో ఉంటున్న ఇయాజ్ రెహ్మాన్ 2002లో రెహామ్ ఖాన్ను పెళ్లాడాడు. 2007లో వీరు విడాకులు తీసుకున్నారు.
తన మాజీ భార్య మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలలో తన పేరును ప్రస్తావిస్తోందని, తద్వారా తనకు పరువు నష్టం కలుగుతోందని, తనకు ఆర్థికంగా నష్టం కలుగుతోందని ఆ మాజీ భర్త పేర్కొన్నాడు. తనకు 14 రోజుల్లో పరువు నష్టం కేసులో డబ్బులు ఇవ్వాలని, అలాగే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమెను కోర్టుకు లాగుతామని చెప్పారు.