పిలవాల్సిన అవసరంలేదు, ఇమ్రాన్ ప్రపంచ కప్ ఆడితే వెళ్తా: రెహామ్
కరాచీ: తాను కరాచీకి వచ్చేందుకు ఎవరి ఆహ్వానం అవసరం లేదని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భార్య రెహామ్ ఖాన్ గురువారం వ్యాఖ్యానించారు. ముత్తహిద ఖామీ మూవ్మెంట్ చీఫ్ అల్తాఫ్ హుసైన్ ఇటీవల మాట్లాడుతూ.. ఇమ్రాన్, అతని భార్య రెహాన్ను తాము ఖరాచీకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
దీనిపై రెహామ్ ఖాన్ స్పందించారు. తనకు ఎవరి ఆహ్వానం అవసరం లేదని చెప్పారు. తాను ఎన్ఏ 246లో గల తన సోదరులు, సోదరీమణులైన (స్థానికులు) ఆహ్వానం మేరకే వస్తానని చెప్పారు. ఎన్ఏ 246 నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్, రెహామ్ ఖాన్ కరాచీకి వచ్చారు.
ఈ సందర్భంగా మీరు రాజకీయాలలోకి ఆరంగేట్రం చేస్తున్నారా? ఈ ప్రచారం రాజకీయాల్లోకి మీరు వచ్చేందుకు తొలి మెట్టు అనుకోవచ్చా? అని విలేకరులు ప్రశ్నించారు.
దానికి రెహామ్ ఖాన్ స్పందిస్తూ.. తాను ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా వచ్చానని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ కప్ ఆడుతుంటే తాను మద్దతిచ్చేందుకు అక్కడకు వెళ్లినట్లుగా ఇప్పుడు ఆయనకు మద్దతుగా వచ్చానని చెప్పారు.
అలాగే కే2 (ప్రపంచంలోనే ఎత్తైన రెండో పర్వతం) ఎక్కినా మద్దతు పలుకుతానని అన్నారు. తాను ఎక్కడైనా అతనికి మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను రాజకీయ నాయకురాలిని కాదని వ్యాఖ్యానించారు. ఎన్ఏ 246 ఓటర్లు ఎప్పుడు పొరపాటు చేయరని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి వారికి బాగా తెలుసునని చెప్పారు. కరాచీలో ఇమ్రాన్ ఖాన్ ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లవచ్చునన్నారు.