పాక్ కు హిల్లరీ మద్దతు ? కాశ్మీర్ ఇస్తారంటా !
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్ కు అనుకూలంగా ఉన్నారని రిపబ్లిక్ హిందూ కొలిషన్ సంస్థ మండిపడింది. హిల్లరీ అమెరికా అధ్యక్షురాలు అయితే భారత్ లోని కాశ్మీర్ ను పాక్ కు అప్పగించడానికి సిద్దం అవుతారని ఆరోపించారు.
ఇండియన్-అమెరికన్ టెలివిజన్ చానల్ లో రిపబ్లిక్ హిందూ కొలిషన్ హిల్లరీ క్లింటన్ మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇచ్చింది. హిల్లరీకి దీర్ఘకాలంగా సహచరిగా ఉన్న పాక్ సంతతికి చెందిన హుమా అబేదిన్ మాటే చెల్లుబాటు అవుతుందని అన్నారు.
హుమా అబేదిన్ మాట కాదనలేక హిల్లరీ చాల కాలం నుంచి పాక్ కు పరోపకారం చేస్తున్నారని చెప్పారు. భారత్ కు వ్యతిరేకంగా దాడులు చెయ్యడానికి పాక్ కు బిలియన్ డాలర్ల సైనిక పరికరాలను సమకూర్చారని రిపబ్లికన్ హిందూ కొలిషన్ ఆరోపించింది.
ఇప్పటి వరకు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ దూసుకుపోతూ కనిపించినా, తాజా పోల్స్లో ఆమె కాస్త వెనుకంజ వేస్తున్నట్లు వెలుగు చూసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఆరు రోజులే (నవంబర్ 8వ తేది పోలింగ్) మిగిలింది.
రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ నెమ్మదిగా తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్కు వ్యతిరేకంగా రిపబ్లికన్ హిందూ కొలిషన్ దూకుడు ప్రచారం మొదలు పెట్టింది.
హుమా అబేదిన్ సూచనలు, సలహాల మేరకు పాక్ కు సైనిక పరికరాలను సమకూర్చారని, భారత్ కు వ్యతిరేకంగా మిలటరీ ఎక్విప్ మెంట్ ను సహాయంగా అందజేశారని టెలివిజన్ చానల్ లో ప్రకటనలు ఇచ్చారు.
అంతే కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ వీసాలను సైతం హిల్లరీ క్లింటన్ అడ్డుకున్నారని ఆ సంస్థ ఆరోపించింది. అదే విధంగా రాడికల్ ఇస్లాంను సమర్థించే దేశాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి హిల్లరీ క్లింటన్ విరాళాలు స్వీకరించారని రిపబ్లికన్ హిందూ కొలిషన్ సంస్థ ఆరోపించింది.
గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన హిల్లరీ భర్త బిల్ క్లింటన్ మీద ఆరోపణలు చేశారు. బిల్ క్లింటన్ కాశ్మీర్ ను పాక్ కు అప్పగించడానికి అప్పట్లో ప్రయత్నించారని ఆరోపించారు. అయితే క్లింటన్ ప్రచారానికి నిధులు సేకరిస్తున్న అజయ్ జైన్ ఈ ప్రకటనలపై మండిపడుతున్నారు.
ట్రంప్ ఓడిపోతారని తెలుసుకుని ఇప్పుడు హిల్లరీ క్లింటన్ మీద లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని అజయ్ జైన్ విమర్శించారు. ప్రవాస భారతీయులు హిల్లరీ క్లింటన్ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఈ ప్రకటనలు ఎన్ఆర్ఐల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూందో వేచిచూడాలి.