నీతులు చెబుతూనే గోతులు తవ్విన పాక్: సరిహద్దుల్లో పాక్ మరో దుశ్చర్య
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి పీఓకేపై దాడులు చేయడంతో ప్రతీకారచర్యల్లో భాగంగా భారత సైన్యం కూడా ఫిరంగి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులతో సరిహద్దు రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇక సరిహద్దు రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ సందర్శనకు జర్నలిస్టులు వస్తున్నారని భారత్ కాల్పుల విరమణ ఒప్పందంను ఉల్లంఘించరాదంటూ ఇండియన్ ఆర్మీకి సరైన మార్గం ద్వారా సమాచారం చేరవేసింది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం తన కుటిల బుద్ధిని బయటపెట్టింది.
గోతులు తవ్విన పాకిస్తాన్
ఓ వైపు నీతి పలుకులు పలుకుతూనే మరోవైపు గోతులు తీసింది పాకిస్తాన్. భారత ఆర్మీ సరిహద్దులో కాల్పులు జరపరాదని చెబుతూ మరోవైపు ఎల్ఓసీ వద్ద కాల్పులకు తెగబడింది. దీంతో స్కూలు తర్వాత ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థులు కాల్పుల భయంతో అక్కడే చిక్కుకుపోయారు. పాకిస్తాన్ ఆర్మీ అభ్యర్థనను భారత్ అంగీకరించినప్పటికీ పాక్ ఇలాంటి పాపానికి పాల్పడింది.
పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
పీఓకేలోని ముజఫరాబాద్లో పాకిస్తాన్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలకు దిగారు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దౌత్యాధికారులను, జర్నలిస్టులను పాక్ ప్రభుత్వం పీఓకే సమీపంలోని సరిహద్దు రేఖ వద్దకు తీసుకెళ్లిన రోజునే నిరసనలు వ్యక్తమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం రోజున పాకిస్తాన్ పీఓకేలోని నివాస ప్రాంతాలపైకి ఫిరంగిదాడులు చేయడంతో ఇద్దరు పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఈ కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం.
ధ్వంసమైన పాక్ స్థావరాల వద్దకు దౌత్యాధికారులు
ఇదిలా ఉంటే తంగ్ధార్, కీరన్ సెక్టార్లలో భారత్ పాక్ ఉగ్రవాదులకు సంబంధించి నాలుగు లాంచ్ప్యాడ్లను ధ్వంసం చేసింది. దీంతో 6 నుంచి 7 ఉగ్రవాదులు మృతి చెందినట్లు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. అయితే తమకు జరిగిన నష్టాన్ని బయటపెట్టుకునేందుకు పాకిస్తాన్ ముందుకురాలేదు. కానీ భారత సైన్యం జరిపిన దాడుల్లో పాక్ భూభాగంలో ధ్వంసమైన నివాస ప్రాంతాలను విదేశీ దౌత్యాధికారులకు, జర్నలిస్టులకు చూపించేందుకు మాత్రం తీసుకెళ్లింది. వీరందరినీ నీలం లోయకు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లువాలియాను కూడా సరిహద్దు రేఖ దగ్గరకు రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. అయితే గౌరవ్ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు.