థాయ్ కేవ్ ఆపరేషన్: పిల్లల ధైర్యానికి హ్యాట్సాప్, క్లిష్టపరిస్థితుల్లో ఇలా..
బ్యాంకాక్: థాయ్లాండ్లోని తామ్ లువాంగ్ గుహలో నుంచి బయటపడిన 12 మంది బాలురు ఒక్కొక్కరు సరాసరి 2 కిలోలు తగ్గినట్లుగా అధికారులు వెల్లడించారు. గత నెల జూన్ 23న కోచ్ సహా 13 మంది గుహలోకి వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. జూలై 2వ తేదీన వారు చిక్కుపోయినట్లుగా గుర్తించారు.
ట్విస్ట్.. గుహలో ధ్యానంలో చిన్నారులు?: వారిని కాపాడటంలో భారత కంపెనీ సహకారం
అనంతరం వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పని చేశారు. ఎన్నో ప్రత్యామ్నాయాలు చూశారు. చివరకి గత ఆదివారం నలుగురిని, సోమవారం నలుగురిని, మంగళవారం ఐదుగురిని రక్షించారు. ఈ రెస్కూ ఆపరేషన్లో వివిధ దేశాలకు చెందిన డైవర్లు కూడా పాల్గొన్నారు.
బాలుర ఆరోగ్యం భేష్, సగటున 2 కిలోలు తగ్గారు
12 మంది బాలురు, కోచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్కొక్కరు సగటున రెండు కేజీల చొప్పున బరువు తగ్గారని అధికారులు తెలిపారు. టీమ్ వర్క్ కారణంగా వారు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. ఇంకో విషయం ఏమంటే వారి ఆరోగ్యం బాగుందని, వారు ఒత్తిడిలోను లేరని చెప్పారు. గుహ లోపల కావాల్సిన నీరు దొరికిందని, కాబట్టి వారికి ఆహారం లేకపోవడం పెద్దగా ఇబ్బంది కలగలేదని చెప్పారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు, అండగా కోచ్
బాలురతో పాటు కోచ్ కూడా బాగానే ఉన్నాడని తెలిపారు. గుహలో అలాంటి పరిస్థితుల్లో బాలురు ధైర్యంగా ఉన్నారని ప్రశంసించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికి మరొకరు తోడుగా.. ధైర్యం చెప్పుకున్నారన్నారు. అలాగే వారి కోచ్ కూడా వారిలో ధైర్యం నూరిపోశాడని తెలిపారు.
ఆసుపత్రిలో చేతులు ఊపుతూ
కాగా, 18 రోజుల పాటు గుహలో గడిపిన 12 మంది బాలుర మనోధైర్యం ప్రపంచాన్ని ముచ్చెటగొలిపేలా చేస్తోంది. కోచ్ వయస్సు 25. బాలుర వయస్సు 11 నుంచి 16 ఏళ్లు మాత్రమే. అలాంటి వారు ధైర్యంగా ఉన్నారు. వారిలో కనీసం ఒత్తిడి ఛాయలు కూడా లేకపోవడం గమనార్హం. వారు ఆసుపత్రిలో సంతోషంగా చేతులు ఊపుతున్న చిత్రాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వారి తరలింపు దృశ్యాలను విడుదల కూడా చేసింది.
కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలి
ఇదిలా ఉండగా, బాలలను కొన్ని నెలలపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరముందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి ఏదో ఒక రూపంలో బయటపడటానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చునని ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ యాంక్జైటీ డిజార్డర్స్ అండ్ ట్రామా నిపుణులు తెలిపారు. ఇలాంటి భయానక అనుభూతి తర్వాత చీకట్లో ఉన్నట్లు, ఈత కొడుతున్నట్లు, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటున్నట్లు అనిపించడం సాధారణమని చెప్పారు. వీటి నుంచి తప్పించుకునేందుకు నెల వరకు పడుతుందన్నారు. బాలురు మొదటి వారం వీరు ఓ సన్నని రాతి దిబ్బపై కడు చీకట్లో గడిపారు.