చపారే వైరస్.. ప్రపంచంపై మరో మహమ్మారి పిడుగు... మానవ సమాజానికి మరో ముప్పు తప్పదా?
ప్రపంచానికి ఇది మరో పిడుగు లాంటి వార్త. ఇప్పటికే కరోనా వైరస్తో జరిగిన,జరుగుతున్న నష్టానికి తల్లడిల్లుతున్న ప్రపంచ దేశాలకు మరో 'వైరస్'.. ముప్పుగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దం క్రితం బొలీవియాలో బయటపడ్డ చపారే వైరస్కి సంబంధించి అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజాగా అత్యంత ప్రమాదకర విషయాన్ని గుర్తించింది. ఆ వైరస్ మనుషల్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని నిర్దారించింది. ప్రాణాంతక ఈ వైరస్ మానవ సమాజానికి మరో ముప్పును తీసుకొస్తుందా అన్న కోణంలో ప్రస్తుతం సీడీసీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
Recommended Video
చపారే వైరస్ సోకితే...
2004లో మొదటిసారిగా బొలీవియాలోని చపారే రాష్ట్రంలో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. అప్పటినుంచి దీన్ని చపారే వైరస్గానే పిలుస్తున్నారు. ఎబోలా తరహా వ్యాధి లక్షణాలను వ్యాప్తి చేసే ఈ వైరస్ ద్వారా శరీరంలో అంతర్గత రక్తస్రావం,పొత్తి కడుపులో నొప్పి,వాంతులు,చిగుళ్ల నుంచి రక్తం కారడం,కంటినొప్పి,చర్మంపై దద్దర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమైతే అది మరణానికి దారితీస్తుంది. దీన్ని చపారే హేమరేజ్ ఫీవర్(CHHF)గా పరిగణిస్తారు. చపారే వైరస్ కూడా ఎబోలా వ్యాధికి కారణమైన అరెనావైరస్ మూలాల నుంచే పుట్టుకొచ్చినట్లు చెప్తున్నారు. సాధారణంగా ఇది ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఇప్పటికీ మిస్టరీ వైరస్ గానే...
బొలివీయాలో బయటపడ్డ చపారే వైరస్ను ప్రస్తుతానికి మిస్టరీ వైరస్గానే పరిగణిస్తున్నారు. దీని గురించి ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. నిజానికి బొలీవియాలో చాలా ఏళ్ల నుంచే ఈ వైరస్ ఉనికిలో ఉండి ఉంటుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. బహుశా వైద్య పరీక్షల్లో దాన్ని డెంగ్యూ అనో లేక దోమ కాటు వల్ల సోకిన వ్యాధిగానో తప్పుగా గుర్తించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. 2019లో బొలీవియా రాజధాని లా పాజ్లో ఇద్దరు హెల్త్ కేర్ వర్కర్స్ చపారే వైరస్ బారినపడ్డారు. ఇద్దరు పేషెంట్ల ద్వారా వీరికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వైరస్ సోకిన నలుగురిలో ఇద్దరు హెల్త్ కేర్ వర్కర్స్తో సహా ఓ పేషెంట్ మృతి చెందాడు.
మనుషుల్లో ఒకరి నుంచి మరొరికి...
చపారే వైరస్ ద్వారా సోకే హేమరేజ్ ఫీవర్ శరీరంలోని పలు అవయవాల పనితీరును దెబ్బతీయడంతో పాటు రక్తనాళాల గోడలను కూడా ధ్వంసం చేస్తుంది. ఈ వారం ప్రారంభంలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ అండ్ హైజీన్(ASTMH) సమావేశంలో... అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పరిశోధకులు చపారే వైరస్కు సంబంధించి ప్రమాదకర విషయాలను వెల్లడించారు. 2019లో నమోదైన కేసులను అధ్యయనం చేయడం ద్వారా... ఇది మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని నిర్దారించినట్లు తెలిపారు.
2019లో ముగ్గురు మృతి...
బొలీవియాలోని లా పాజ్లో చనిపోయిన హెల్త్ వర్కర్స్ ఇద్దరూ చపారే వైరస్ సోకడంతోనే చనిపోయినట్లు తెలిపారు. అప్పటికే చపారే వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్స అందించడం ద్వారా వీరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. చపారే వైరస్ సోకిన పేషెంట్ల రక్తం,మూత్రం,వీర్యం,ఉమ్మి ద్వారా ఈ వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. కాబట్టి హెల్త్ కేర్ వర్కర్స్ అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా అధ్యయనం జరుపుతున్నామని... మానవ సమాజానికి దీనితో మరో ముప్పు పొంచి ఉందా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.